04-02-2026 01:19:28 AM
చెన్నై, ఫిబ్రవరి 3: ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ త్వరలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచేజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. మహిళల క్రికెట్కు ప్రాధాన్యం ఇస్తూ, ఈ లీగ్లో భాగస్వామ్యం కావడం తమ తదుపరి ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. తమిళనాడు గ్లోబల్ టూరిజం సమ్మిట్ సందర్భంగా కాశీ విశ్వనాథన్.. సీఎస్కే భవిష్యత్ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పురుషుల క్రికెట్లో బలమైన బ్రాండ్గా ఎదిగిన సీఎస్కే, ఇకపై మహిళల క్రికెట్లో కూడా తన ముద్ర వేయాలని భావిస్తోందని తెలిపారు. గ్రాస్రూట్ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కాశీ చెప్పారు. అందులో భాగంగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో జట్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
ఇదే కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ పై కూడా కాశీ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2008 నుంచి సీఎస్కేకు ధోనీ ప్రధాన బలంగా మారాడని, అతడి నాయకత్వం జట్టును విజయాల బాట పట్టించిందని అన్నారు. మైదానంలో తీసుకునే నిర్ణయాలన్నింటిలోనూ ధోనీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఆశ్విన్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే వంటి ఆటగాళ్ల ఎదుగుదలలో ధోనీ పాత్ర కీలకమని గుర్తు చేశారు. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో అతడి అనుభవం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. తమిళనాడులో ధోనీకి ఉన్న అభిమానానికి భాష అడ్డంకి కాదని.. ప్రతిభ, కష్టపడి ఎదిగిన తీరు వల్లే అతడు ఇక్కడ ఐకాన్గా మారాడని కాశీవిశ్వనాథ్ తెలిపారు. ఇక ధోనీ సీఎస్కేతో ఎప్పటికీ అనుబంధంగా కొనసాగుతాడని స్పష్టం చేశారు.