బాక్సర్లకు చివరి అవకాశం
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్
బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నీ భారత బాక్సర్లకు చివ రి అవకాశం కానుంది. శుక్రవారం నుంచి బ్యాంకాక్ వేదికగా ప్రారంభం కానున్న టోర్నీలో భారత్ నుంచి 10 మంది బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల విభాగంలో 51 కేజీల విభాగంలో పోటీ పడనున్న అమిత్ పంగల్పైనే అందరి దృష్టి ఉంది. ఇక సచిన్ సివాచ్ (57 కేజీలు), అభినాష్ జమ్వాల్ (64 కేజీలు), నిషాంత్ దేవ్ (71 కేజీలు), అభిమన్యు లోరా (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు), నరేందర్ బెర్వాల్ (92+ కేజీలు) బరిలో ఉన్నారు. మహిళల విభాగంలో జాస్మిన్ లంబోరియా (57 కేజీలు), అనుకుషితా (60 కేజీలు), అరుంధతీ చౌదరీ (66 కేజీలు) పోటీ పడనున్నారు. ఇక భారత్ నుంచి ఇప్పటివరకు ముగ్గురు బాక్సర్లు మాత్రమే పారిస్ కోటా దక్కించుకున్నారు. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు) ఈ జాబితాలో ఉన్నారు. పర్వీన్ హుడా (57 కేజీలు) విశ్వక్రీడలకు అర్హత సాధించినప్పటికి తన ఆచూకీ వివరాలు చెప్పని కారణంగా ఆమెపై 22 నెలలు నిషేధం పడింది. దీంతో పర్వీన్ ఒలింపిక్స్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది.






