నిలువ నీడ కరువు...!
బస్టాండుకు నోచుకోని అర్వపల్లి
ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపైనే బస్సుల కోసం ఎదురుచూపు
ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
బస్టాండ్ నిర్మించాలని పలువురు డిమాండ్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 21: సూర్యాపేట - జనగామ, నకిరేకల్ - తానంచర్ల జాతీయ రహదారుల ప్రధాన కూడలి ప్రాంతమైన మండల కేంద్రం అర్వపల్లిలో బస్టాండు లేక నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లేందుకు నిత్యం ప్రజలు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కనీస నీడ,త్రాగునీరు, టాయి లెట్లు లేక వారు పడే ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి.రెండు హైవేల కూడలితో పాటు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆల యం, మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచి రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చే హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఇక్కడే ఉన్నాయి.అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఎక్కువగా అర్వపల్లికి వ్యాపార నిమిత్తం వచ్చి వెళ్తుంటారు.
అయినా అర్వపల్లిలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.ఎండ వేడిమికి తట్టుకోలేక పక్కనే ఉన్న దుకాణాల ముందు నిలబడితే షాపు యజమానులు వెళ్లగొడుతున్నారు.ఇన్ని ప్రభుత్వాలు మారినా అర్వపల్లిలో ప్రయాణికుల కోసం బస్టాండ్ నిర్మించక ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా బస్టాండ్ నిర్మించి ఇబ్బందులు తీర్చాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం
రెండు హైవేలపై ఉన్న అర్వపల్లిలో బస్టాండు లేక ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నాం.బస్సుల కోసం ఎండకు ఎండుతూ,వానలో తడుస్తూ నిరీక్షించాల్సి వస్తుంది.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి బస్టాండును ఏర్పాటు చేయాలి.
బింగి బాలరాజు యాదవ్, ప్రయాణికుడు






