10-08-2025 12:29:27 AM
రెండోస్థానంలో పత్తి, మొక్కజొన్న పంటలు
-తెలంగాణలో ఏటా తగ్గిపోతున్న సంప్రదాయ పంటలు
-సోయాబీన్ మినహా నూనెగింజల పంటలు కనుమరుగు
-పప్పుదినుసుల పంటలదీ అదే దారి
-పంటల మార్పిడిని పట్టించుకోని రైతన్న
-సులభంగా సాగుచేసే పంటల వైపే మొగ్గు
హైదరాబాద్, ఆగస్టు ౯ (విజయక్రాంతి): తెలంగాణలో ఎక్కువగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది, నువ్వులు, వేరుశనగ(పల్లి), సోయాబిన్, జొన్న పంటలను రైతులు పండిస్తారు. పెసర్లు, ఉలువలు, ఆముదం, మినుములతో పాటు ఇతర తృణధాన్యాలను కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆయా నెలలను బట్టి సాగు చేస్తారు.
ఇప్పుడు తెలంగాణలో వరి ప్రధాన పంటగా మారింది. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో వరి సాగుపైనే రైతులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. దక్షిణ భారతదేశంలో వరి పంటకు పుట్టినిల్లుగా తెలంగాణ మారింది. అయితే తెలంగాణలో ప్రధాన సంప్రదాయ పంటల సాగు తగ్గిపోతుంది. సోయాబీన్ మినహా పలు నూనెగింజల పంటల సాగు తగ్గుతుండగా, కొన్ని పంటలు దాదాపు కనుమరుగు అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పల్లి, నువ్వులు, ఆముదం, ఆవాలు, సన్ఫ్లవర్, కుసుమ, వెర్రినువ్వు పంటలు రాష్ట్రంలో నామమాత్రంగానే సాగవుతన్నాయి.
మరోవైపు పప్పుదినుసులది అదే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో ప్రతి రైతు ఏటా వరితో పాటు ఇతర సంప్రదాయ పంటలను కూడా సాగు చేసేవారు. ఇప్పుడు కొన్ని పంటలనే సాగు చేస్తుండటం, సంప్రదాయ పంటలు కనుమరుగు అవుతుండటంతో వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల మార్పిడి చేయాలని సంబంధిత శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నా పట్టించుకోడం లేదని, సులభంగా సాగు చేసే పంటల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.
సోయాబీన్ అత్యధికం..తగ్గుతున్న పల్లి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గతంలో వేరుశనగ(పల్లి) పంట సాగుకు ప్రసిద్ధిగా ఉండేది. ఈ ప్రాంతంతో పాటు నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోనూ పల్లి పంటను సాగు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాష్ట్రంలో ఈసారి ఇప్పటివరకు 1,227 ఎకరాల్లో మాత్రమే వేరుశనగ సాగయ్యింది. వేరుశనగతో పాటు నూనె గింజల పంటలు రాష్ట్రంలో దాదాపు కనుమరుగయ్యాయి. నూనెపంటల క్యాటగిరీలో సోయాబీన్ ఒక్కటే రాష్ట్రంలో అత్యధికంగా 3.49 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఇక సోయాబిన్ పూర్తిగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటు సంగారెడ్డి జిల్లాకు పరిమితమైంది.
రాష్ట్రం లో మొత్తం నూనె గింజల పంటలు 3.51 లక్షల ఎకరాల్లో సాగు అవుతుంటే, అందులో సోయాబీన్ ఒక్కటే 3.49 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో నూనెపంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.69 లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేయగా, అందులో దాదాపు సగం విస్తీర్ణంలో సోయాబీన్ పంట ఒక్కటే సాగవుతోంది. మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం 14 లక్షల ఎకరాలు ఉంటుందని, 16 లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జొన్నలు కూడా దాదాపు 1.20 లక్షల ఎకరాల భూమిలో సాగు అవుతున్నాయని అంచనాతో ఉన్నారు.
అపరాలు అంతంత మాత్రమే
ఇక మిగతా సంప్రదాయ పంటలైన నువ్వులు, ఆముదం, ఆవాలు, సన్ఫ్లవర్ వంటి పంటలన్నింటినీ కలిపినా 2 వేల ఎకరాలు లేకపోవడం గమ నార్హం. ఆవాలు, కుసుమ, వెర్రినువ్వులు మొదలైన నూనె పంటలు ఏకంగా 1.12 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, కేవలం 57 వేల ఎకరాల్లో మాత్రమే ఈ పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలంలో పప్పు దినుసు పంటలు 7.92 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచన వేయగా, ఇప్పటివరకు సాగయింది కేవలం 4.86 లక్షల ఎకరాలే.
అందులో కంది, పెసర పంటలదే 60 శాతం వాటా ఉండగా, ఆ తర్వాత స్థానంలో మినుముల పంట ఉంది. అయితే ఈ పంటల విస్తీర్ణం తీసుకుంటే కంది పంట ఒక్కటే 4.21 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే దాదాపు 2.23 లక్షల ఎకరాలు లోటుగా ఉంది. పెసర పంట 86 వేల ఎకరాల సాగు విస్తీర్ణానికి గాను 50 వేల ఎకరాలు, మినుములు 15 వేల ఎకరాలు, ఉలవలు కేవలం 171 ఎకరాలు, బొబ్బర్లు, అనుములు కలిపి 362 ఎకరాల్లోనే సాగయ్యాయి.
60 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా
కాగా, దశాబ్దల క్రితం వరకు సంప్రదాయ పంటలకు నిలయమైన తెలంగాణ పల్లెలు ఇప్పుడు కేవలం వరి, పత్తి పంటలతోనే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పత్తి, వరితో పాటు మొక్క జొన్న, కంది పంటలు కలిపి ఏకంగా కోటి ఎకరకాల్లో సాగు చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో అత్యధి కంగా వరి 60 లక్షల ఎకరాల్లో సాగయ్యే పరిస్థితి ఉండగా, ఇప్పటికే 30 లక్షల వరకు దాటింది. ఇక పత్తి కూడా ఈ ఏడాది 50 లక్షల వరకు సాగవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే దాదాపు 45 లక్షల ఎకరాల వరకు దాటిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
మిశ్రమ పంటలు సాగు చేసే ఉమ్మడి మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులు కూడా వరి సాగువైపు ఆకర్షితులయ్యారు. సాగునీటి సదుపాయం లేని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో లాభదాయకమనే ఉద్దేశంతో పత్తి పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ఇక డిమాండ్ ఎక్కువగా ఉండే సోయాబీన్, కూరగాయలు కూడా అధికంగా సాగు చేస్తున్నారు. దీంతో ప్రధాన సంప్రదాయ పంటలు తగ్గిపోతున్నాయి.