8 May, 2026 | 11:48 AM

స్వామి కార్యం.. స్వకార్యం

10-08-2025 12:24 AM

స్వామి కార్యం.. స్వకార్యం నెరవేర్చుకోవడం ఎలాగో రాష్ట్రానికి చెందిన మంత్రులను చూస్తే అర్థమవుతుంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తాజాగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన పలువురు తెలంగాణ మంత్రులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారు.

అవసరమైతే మోదీ సర్కార్‌ను గద్దెదింపి రాహుల్‌ను పీఎం చేసైనా బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని ఉపన్యాసాలు దంచికొట్టారు. అంతదూరం వెళ్లి ఊరికే వస్తే ఎలా అనుకున్నారో ఏమో మనమంత్రులు.. తమతమ శాఖలకు చెందిన పనిలో బిజీ అయిపోయారు. సంబంధిత కేంద్రమంత్రులను కలిసి తమ శాఖకు, రాష్ట్రానికి చెందిన సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తులు చేశారు.

కొద్దిసేపటి క్రితం వరకు కేంద్రంపై మండిపడిన మంత్రులు, ఎంపీలు ఆ తర్వాత కూల్‌గా వెళ్లి వినతులు సమర్పించి వచ్చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిసి రాష్ట్రానికి జాతీయ హైవే ప్రాజెక్టులపై విజ్ఞప్తులు చేయగా.. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ కలిసి రాష్ట్రాభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. దీంతో కాంగ్రెస్ మంత్రుల పంథాయే వేరు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.                           విజయ్‌భాస్కర్