01-06-2025 05:54:18 PM
నివాళి అర్పించిన జూలకంటి రంగారెడ్డి, అలుగు బెల్లి నర్సిరెడ్డి..
మునగాల: ములకలపల్లి కుమారి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కంకణ బద్దులు కావాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(All India Agricultural Workers Union) జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. ఆదివారం మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు సతీమణి ములకలపల్లి కుమారి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన బి. వెంకట్ మాట్లాడుతూ... ములకలపల్లి కుమారి మరణం ప్రభుత్వ హత్య అని అన్నారు.
ప్రభుత్వాలు ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టడం మూలంగా ఆ సంపదను దోచుకునేందుకు పెట్టుబడిదారులు చేస్తున్న వినాశనం లో భాగంగానే ప్రకృతి విధ్వంసం జరుగుతుందని దాని మూలంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీని మూలంగానే ములకలపల్లి కుమారి మృతి చెందారని అన్నారు. ములకలపల్లి రాములు ను సిపిఎం పార్టీ నాయకుడిగా ఎదగడంలో కుమారి సహకారం ఎంతో ఉందన్నారు. సిపిఎం నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా తన భర్త ములకలపల్లిరాములు ఎన్నికై ప్రజా సేవలో ఉన్నప్పుడు ఆమె ఎంతో ఓర్పుగా ఉంటూ అన్ని విధాలుగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ, సహకారాలు అందించారని అన్నారు.
ఇంటికి వచ్చే నాయకులకు, కార్యకర్తలను ఆప్యాయతగా పిలుస్తూ వారికి భోజనాలు పెట్టే వారన్నారు. భర్త పార్టీ పనిలో ఉండగా ఆమె కుటుంబ బాధ్యతలు చూస్తూ పిల్లలను పెంచిపోషించిందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ... మునగాల మండలంలో శత్రువుల భారీ నుండి పార్టీని, కార్యకర్తలను కాపాడటంలో ములకలపల్లి రాములు ఎంతో కృషి చేశారని అన్నారు.పార్టీ ఆధ్వర్యంలో జరిగే అనేక ప్రజా పోరాటాలలో పాల్గొన్నారని గుర్తు చేశారు.ములకలపల్లి రాములు కు చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా పార్టీ, ప్రజా సంఘాల కార్యక్రమాల్లో కుమారిపాల్గొనేదని అన్నారు. పార్టీ, ప్రజా సంఘాల మహాసభలు జరిగిన సందర్భంగా వాలంటీర్ గా అనేక సేవలు అందించడంలో కుమారి ముందువరుసలో ఉండేది అన్నారు. ములకలపల్లి రాములుకు సమాజం అండగా నిలవాలని కోరారు.
ఉద్యమంలో గత 30 ఏళ్లుగా రాములు ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్నారని అన్నారు. తాను ఆప్యాయతతో పలకరించి కలగొలుపుగా ఉండేది అన్నారు. రాములుకు అండదండలుగా ఉండే కుమారి మరణించడం చాలా బాధాకరమని అన్నారు. అనంతరం ములకలపల్లి కుమారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళిఅర్పించారు. అంతకుముందు ములకలపల్లి కుమారి స్మృతి యార్థం సిపిఎం కొక్కిరేణి గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాటల సిడిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు.
సిపిఎం గ్రామ కార్యదర్శి నందిగామ సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట రాములు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బొప్పన పద్మ, జగన్, బొజ్జ చిన్న వెంకులు, సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, సిపిఎం సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవారం వెంకటరెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు సైదులు, మిట్టగనుపుల ముత్యాలు, షేక్ సైదా, బచ్చల కూర స్వరాజ్యం, జూలకంటి విజయలక్ష్మి, సిపిఐ జిల్లా నాయకులు దొడ్డ వెంకటయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు ఒక్కంతుల ప్రభాకర్, ఎంసిపిఐ(యు) రాష్ట్ర నాయకులు వసు కుల ముట్టయ్య, నాయకులు చందా చంద్రయ్య,జంపాల స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.