పాక్ హోటల్కు 1,860 కోట్ల చెల్లింపు
వాషింగ్టన్, డిసెంబర్ 1: అమెరికాలో పాకిస్థాన్ ప్రభుత్వ అధీనంలో ఉన్న ఓ 19 అంతస్తుల హోటల్కు అమెరికా ప్రభుత్వం అద్దెరూపంలో ఏకంగా 220 మిలియన్ డాలర్లు చెల్లిస్తోంది. ఈ చెల్లింపులపై రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అక్రమ వలసదారులు మనదేశంలో విడిది చేసేందుకు.. మనమే వాళ్లకు వసతి కల్పిస్తున్నాం. అందుకు డబ్బులు కూడా మనమే చెల్లిస్తున్నాం. ఇది ఆమోద యోగ్యం కాదు’ అని వివేక్ మండిపడ్డారు.
న్యూయార్క్ నగరం మాన్ హట్టన్లో ఈ హోటల్ ఉంది. రూజ్వెల్ట్ హోటల్ గురించి రచయిత జాన్ లెఫెవ్రే ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. ఈ పోస్ట్లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఆధీనంలో ఉన్న రూజ్వెల్ట్ హోటల్కు న్యూయార్క్ నగర పాలక సంస్థ 220 మిలియన్ డాలర్లు (రూ.1860.40 కోట్లు) అద్దె చెల్లిస్తోంది. ఇమ్మిగ్రేషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ పౌరులకు ఈ హోటల్ వసతి కల్పిస్తున్న నేపథ్యంలో వివేక్ రామస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.






