calender_icon.png 22 June, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి డీఈఓ మాధవి అవినీతిపై విచారణ జరిపి, సస్పెండ్ చేయాలి

03-06-2025 04:58:20 PM

సమగ్ర శిక్ష నిధులు రూ. 65 లక్షలు గోల్ మాల్...

టీచర్ ట్రైనింగ్ క్యాంప్ ల నిర్వహణ నిధుల్లో రూ. 35 లక్షల కుంభకోణం..

ప్రైవేటు పాఠశాలలో డీఇవో భాగస్వామ్యంతో పాటు అన్ని స్కూళ్లలో అక్రమ వసూళ్లు..

కంప్యూటర్స్, ఫర్నిచర్, స్టేషనరీ కొనుగోళ్ళలో డీఇవో అక్రమాలు..

ప్రభుత్వ ఉపాధ్యాయులతో కుమ్మక్కై అక్రమ హెచ్ఆర్ఏ లలో భాగస్వామ్యంతో పాటు అక్రమ ఫైనాన్స్, చిట్టీల దందాల నిర్వహణ..

జిల్లా కలెక్టరేట్ ఎదుట అవినీతి డీఇవో ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి, యువజన సంఘాల బహిరంగ ఆందోళన..

పెద్దపల్లి (విజయ‌‌‌క్రాంతి): జిల్లా విద్యాధికారి శ్రీమతి మాధవి(District Education Officer Madhavi) అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థి యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, గంటకు పైగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి, విద్యాధికారిని సస్పెండ్ చేయాలంటూ నినదిస్తూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ... డీఈఓ మాధవి అవినీతి, అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం వల్ల ప్రజా ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని, టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీ అవకతవకలు జరిగాయని, ఇందులో డీఈఓ మాధవి కీలకపాత్ర వహించిందన్నారు. సమగ్ర శిక్ష నిధుల వినియోగంలో జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్న డీఈఓ మాధవి భారీగా అవకతవకలకు పాల్పడి చట్టవిరుద్దంగా దోపిడీకి తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్స్ కొనుగోళ్లలో ఇతర ప్రభుత్వ నిధుల వినియోగాల్లో ఆర్థిక అక్రమాలపై సంబంధిత అధికారులు  సంవత్సరం క్రితమే డీఈఓ కు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని దీన్ని తొక్కి పెట్టారని ఆ నివేదికపై చర్యలెందుకు చేపట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. 

ఇన్స్పైర్ అవార్డుల నిర్వహణకు ప్రభుత్వం నుండి మంజూరైన లక్షలాది రూపాయల నిధులను డీఈఓ మాధవి ప్రైవేట్ స్కూళ్ల నుంచి వసూలు చేసిన డబ్బుతో కార్యక్రమం నిర్వహించి, ప్రభుత్వ నిధులను జేబులో వేసుకుందని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేకుండా లక్ష్ అనే ప్రైవేటు పాఠశాల ప్రారంభించినా చర్యలు తీసుకోకపోవడం వెనుక లావాదేవీలు జరిగాయని అనుమానించాల్సి వేస్తోందని, ప్రైవేటు పాఠశాలల అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన కీలక బాధ్యత ఉన్న ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. డీఈఓ కార్యాలయంలో ఉన్న ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని వసూళ్ళకోసం తన ఏజెంట్‌గా నియమించి, అన్ని లావాదేవీలను అతని ద్వారా నిర్వహిస్తున్నారని, అతని ఆన్‌లైన్ లావాదేవీలను పరిశీలిస్తే అసలు అవినీతి బయటపడుతుందని స్పష్టం చేశారు.

 జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థానికంగా నివసించకపోయినా హెచ్‌ఆర్‌ఏ కోసం వికారమైన పద్ధతుల్లో క్లెయిమ్ చేస్తూ వస్తున్నారని, దీనికి డీఈఓ మాధవి సహకరిస్తోందని వీటిలో కూడా ఆమె వాటా వసూళ్లకు పాల్పడుతోందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు అక్రమంగా ఫైనాన్స్ దందాలు చిట్టీలు నడుపుతున్నారని, దీనికోసం కమాన్ దగ్గరలోని ఒక మెడికల్ షాపులో ఫైనాన్స్ వసూళ్ళకోసం ప్రత్యేక పుస్తకం ఏర్పాటు చేశారని, ప్రతిరోజూ సాయంత్రం ఇందులోనుండి ఆమె వాటా వసూలు చేసుకుంటుందని, ఈ విషయమై విచారణ జరిపితే డీఈఓ పాత్ర బయటపడుతుందన్నారు. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే జిల్లాలో మూడు సంవత్సరాలకే బదిలీ అనివార్యం. అయినా, డీఈఓ మాధవి గత ఐదు సంవత్సరాలుగా పెద్దపల్లిలో కొనసాగుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోందని, ఆమె ఎడిగా ఇతర జిల్లాకు చెందినవారైనా, పెద్దపల్లిలో ఎలా కొనసాగుతున్నారు? దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వాలని ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డీఈఓ మాధవిని తక్షణం సస్పెండ్ చేసి, ఆమె అవినీతి కార్యకలాపాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివైఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు సిలివేరు మధు, గూడెపు జనార్దన్ రెడ్డి, రాజాం మహంత క్రిష్ణ, రామగిరి మహేందర్, జంగా కిరణ్ రెడ్డి, పంజాల రవీందర్ గౌడ్, వెంకటేశ్వర్లు, కొమ్మ ఐలయ్య, పెద్దోల్లా ఐలయ్య, దాడి రవీందర్, ఆలుబోజు రాజేందర్, దొడ్ల రాజయ్య, తీగల అశోక్ గౌడ్, మేరుగు కనకయ్య, కంచి శ్రీనివాస్, ఎల్లేష్ గౌడ్, అనిల్, గంగిపెల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు.