30-05-2025 06:59:47 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ బల్దియాలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు ఆర్థిక సమస్యలతో, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, వెంటనే వారికి వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్న నేపథ్యంలో కార్మికుల పిల్లల చదువులకు ఇబ్బందిగా మారిందని, అనేకమంది అద్దె ఇంట్లో ఉంటున్నారని వారు అద్దె చెల్లించకపోవడంతో యజమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ధ కార్మికులకు వర్షాకాలం నేపథ్యంలో రెయిన్ కోట్లు, బూట్లు, గ్లౌజులు, సేఫ్టీ కిట్లు అందజేయాలని కోరారు. వివిధ డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజయ్ సారధి రెడ్డి, రేషనపల్లి నవీన్, పుచ్చకాయల రమణ, మధుసూదన్, పెరుగు కుమార్, మంద శంకర్, వెంపటి రాములు, లింగాల విజయ్, పుల్లూరు నాగేశ్వరరావు, అచ్చమ్మ, మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు.