24-07-2025 10:42:17 PM
వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు..
అత్యవసర సమయాల్లో డయల్ 100..
పోలీస్ కమిషనర్ సునీల్ దత్..
ఖమ్మం (విజయక్రాంతి): జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలు రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పశువులు, గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శిథిలమైన ఇళ్లు, విధ్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ప్రదేశాల్లోకి వెళ్లరాదన్నారు. పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా చేపాల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని పెర్కొన్నారు. యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111, టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ నెంబరు 9063211298 సమాచారం అందించాలని సూచించారు.