18-09-2025 12:52:29 AM
బెల్లంపల్లి అర్బన్: 70 యేళ్ల క్రితమే తమిళనాడు గడ్డపై బహుజన రాజ్యాధికారాన్ని పెరియార్ రామసామి సాకారం చేశారని పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొడిసెల శ్రీహరి అన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వం బాలికల జూనియర్ కళాశాల వద్ద సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ హబ్ సెంటర్, మహనీయుల విగ్రహాల వద్ద పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో బుధవారం పెరియార్ రామసామి 146వ జయంతి వారోత్సవాలను నిర్వహించారు. ఈ ముగింపు సభలో సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవితో కలసి మహనీయులకు క్యాండిల్ తో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన కులాల ఆత్మగౌరవం కోసం పోరాడి స్వాభిమాన ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయుడు పెరియార్ అని అన్నారు. మహిళల విముక్తి కోసం, దేవదాసి వ్యవస్థని నిర్మూలించారన్నారు. వితంతులకు వివాహాలు చేసి చరిత్రని తిరగరాసాడని, మహిళ చదువు కోసం అహర్నిశలు పరితపించిన పెరియార్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆయన బ్రాహ్మణ ఆధిపత్యం, మతపరమైన మూఢనమ్మకాలు, వివాహ ఆచారాల నిర్మూలన కోసం పోరాడారన్నారు. పెరియార్ హేతువాదం, మహిళల హక్కులు, కుల నిర్మూలనను ప్రోత్సహించారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పైపుల ద్వారా త్రాగు నీటిని అందించిన ఘనత కేవలం పెరియార్ కే దక్కిందని పేర్కొన్నారు.