17-11-2025 12:00:00 AM
సీఎం ముఖ్య సలహాదారున్ని కలిసిన మెస్రం వంశీయులు
ఇంద్రవెల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి) : ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయ అభివృద్ధితో పాటు జనవరిలో ప్రారంభమయ్యే నాగోబా జాతర కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించాలని మెస్రం వంశీయులు కోరారు.
మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నేతృత్వంలో మెస్రం వంశీయులు సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నీ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామం లో జనవరి 22న జరిగే నాగోబా మహా జాతరకు ప్రజల సౌకర్యార్థం అన్ని రకాల శాశ్వత మౌలిక వసతులను కల్పించాలని, అభివృద్ధి పనులకు సైతం వెంటనే ప్రారంభించాలని కోరారు.
కేస్లాపూర్ గ్రామ పంచాయతీను ఆదర్శ గ్రామ పంచాయతీగా గుర్తించి, 150 ఇందిరమ్మ ఇండ్లను మం జూరు చేయాలన్నారు. ఆశ్రమ బాలికల పాఠశాలను అప్ గ్రేడ్ చేసి, అందులో డిజిటల్ తరగతులు నిర్వహించాలన్నారు. ఏక లవ్య పాఠశాలను మరింత అభివృద్ధి చేసి, కేస్లాపూర్ గ్రామంలో మినీ క్రీడా మైదానం మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కేస్లాపూర్ నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు, దేవారి మెస్రం బాదిరావు, ఆలయ పూజారి మెస్రం షేకు, మాజీ సర్పంచ్ నాగనాథ్, కేస్లాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోట్నాక్ భారికరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట్నాక్ కోసేరావు, పెందూర్ గణేశ్,ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు కైలాశ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.