పెట్రోల్, డీజిల్ ఉన్న.. బంకుల ముందు క్యూలైన్లు
తెలంగాణలో ఇంధన కొరతపై సివిల్ సప్లయ్ శాఖ కీలక ప్రకటన
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇందన కొరత లేదని ప్రభుత్వం వెల్లడించింది. గత మూడు రోజులుగా సరపడా సరఫరా జరిగిందని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ కొరతపై సివిల్ సప్లయ్ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత వల్ల తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో డిమాండ్ పెరిగిందని, బెంగాల్ ఎన్నికల(Bengal Elections) తర్వాత ధరలు పెరుగుతాయనే ప్రచారంతో ప్రజలు భయాందోళలో ఉన్నారని సివిల్ సప్లయ్ శాఖ వివరించింది. సరిహద్దు జిల్లాల్లో స్టాక్ పర్యవేక్షిస్తున్నామని, ఇతర రాష్ట్రాల వాహనాలు రాకుండా చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. వదంతులను ప్రజలు నమ్మొద్దని సివిల్ సప్లై శాఖ(Civil Supplies Department) వాహనదారులకు సూచించింది.
హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో నోస్టాక్ బోర్డులు
హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతోంది. మూడో రోజూ పలు పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్ ఉన్న బంకుల ముందు వాహనాలు బారులు తీరాయి. చంపాపేట్, ఐఎస్ సదన్ లో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు ఆందోళన చేపట్టారు. గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు రోడ్డపైన నిలవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. పెట్రోల్ బంకుల వద్ద గొడవలు జరగకుండా పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. బాటిల్లు, క్యాన్లలో పెట్రోలో, డీజిల్ తీసుకుని వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో బంకుల వద్ద ప్రజలు బారులు తీరారు.






