25-06-2025 01:01:35 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే ఫోన్లు ట్యాపింగ్ చేశారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని, ఇది రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అన్నారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ లాలూచీపడకపోతే సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఎంపీ ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లోని సిట్ కార్యాలయంలో వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నత్తనడకన సాగుతోందని, దీని వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అనుమానం వస్తోందన్నారు.
గత ప్రభుత్వంలో అధికారులందరూ కేసీఆర్కు తొత్తులుగా వ్యవహరించారని, కన్ఫర్డ్ ఐపీఎస్ అయిన ప్రభాకర్రావును రాష్ట్రంలో కీలక పదవి అయిన ఎస్ఐబీ చీఫ్గా ఎలా నియమిస్తారు? కేసీఆర్కు ఆయన బంధువా?’ అని ప్రశ్నించారు. ప్రభాకర్రావు నిబంధనలు అతిక్రమించి కేసీఆర్ కోసం పనిచేశారని మండిపడ్డారు.
ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తానేనని, తన కుటుం బ సభ్యులు, డ్రైవర్లు, గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాము ఎక్కడ ఉం టున్నాం.. ఎవరితో మాట్లాడుతున్నాం.. బీజేపీ ప్రణాళికలు ఏంటి అని పూర్తిగా వినేవారని తెలిపారు.
‘తాను హుజూరాబాద్లో, 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్ ట్యాప్ చేశారు.. చివరకు మా భార్య నేను మాట్లాడుకున్న మాటలు కూ డా వినడం దారుణం. బీఆర్ఎస్తో కాంగ్రెస్ లాలూచీపడకపోతే కాళేశ్వరం కమిటీ నివేదిక ఇంకా ఎందు కు బయటపెట్టలేదు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ కమిషన్ వేసి ఏడాదిన్నర అవుతోం ది..నివేదికలు ఎందుకు బయటపెట్టడం లేదో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలి.’ అని డిమాండ్ చేశారు.
పలువురి నేతల వాంగ్మూలం, ఫిర్యాదు..
ఈటల రాజేందర్తో పాటు సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ.. 2023 ఎన్నికల సమయంలో తన రెండు ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దోషులు తెలియాలంటే రేవంత్ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 2020 నుంచి 2024 వరకు తన ఫోన్ సంభాషణలను రహస్యంగా తెలుసుకున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసినట్లు టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెజండ్ల కిషోర్బాబు సిట్కు ఫిర్యాదు చేశారు.