30-11-2024 07:24:29 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్ పూర్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
పటాన్ చెరు (విజయక్రాంతి): క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని భీరంగూడ మండే మార్కెట్లో పండు టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీజన్ 8 రాష్ట్ర స్థాయి మ్యాట్ కబడ్డీ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాలుగా అమీన్ పూర్ వేదికగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. స్వతహాగా క్రీడలు అంటే తనకు ఇష్టమని, కబడ్డీ అంటే అమితమైన ఆసక్తి అన్నారు.
నియోజకవర్గ పరిధిలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. కబడ్డీ పోటీలకు రెండు లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు. భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీలలో 60 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహ గౌడ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ దేవానంద్, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి, కబడ్డీ సంఘం ప్రతినిధి ఎల్లయ్య, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.