13 May, 2026 | 5:37 AM

గోదావరి-బనకచర్ల లింక్ వివరాలివ్వండి

11-01-2025 12:38 AM

జీఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఏపీ సర్కార్ ఇటీవల ప్రకటిం చిన గోదావరి - -బనకచర్ల(జీబీ) లింక్ ప్రాజెక్ట్ వివరాలు ఇవ్వాలని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు జీఆర్‌ఎంబీ అధికారులకు లేఖ రాశారు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున జలాలను బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు తరలించేలా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఇటీవల ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించా రు. ఈ నేపథ్యంలోనే ఏపీ చేపట్టనున్న ప్రాజెక్ట్ వివరాలను తమకు అందించాలని గోదావరి బోర్డును తెలంగాణ సర్కా రు కోరడం విశేషం. మిగులు జలాల పేరిట చేపట్టేందుకు సిద్ధమైన ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు పూర్తిగా నష్టం జరిగే ప్రమాదం ఉందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.

గోదావరిలో కేటా యించిన నీటిని కాకుండా అదనంగా వాడుకునేందుకు ఏపీకి హక్కులేదు. కేటాయింపులు లేకుండానే నీటిని తరలిస్తే తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా భంగం వాటిల్లుతుంది. గోదావరి నీటిని తరలిస్తామని చెబుతున్నా.. గోదావరిలో నీటి లభ్యత లేనప్పుడు కృష్ణా నీటిని కూడా తరలించే ప్రమాదం ఉందని సాగునీటి నిపుణులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ ఈ జీబీ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు కోరటం విశేషం.