10 May, 2026 | 3:21 PM

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ

10-05-2026 02:41 PM

న్యూఢిల్లీ: నటుడిగా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, సినిమా, ప్రజా జీవితానికి చెందిన ప్రముఖుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా ఒక కొత్త బాధ్యతను ఆదివారం స్వీకరించారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కీలకమైన మార్పుకు నాంది పలికింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన సుపరిచిత ముఖాలు పెద్ద సంఖ్యలో హాజరై విజయ్ కి మద్దతు తెలిపారు. నటి త్రిష కృష్ణన్, సంగీత, గాయకుడు క్రిష్ హాజరైన వారిలో ఉన్నారు. వీరు సాధారణంగా గంభీరంగా ఉండే ఈ కార్యక్రమానికి గ్లామర్ హంగును తీసుకొచ్చారు.

ప్రమాణ స్వీకారం జరిగిన కొద్దిసేపటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ్‌కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సి. జోసెఫ్ విజయ్‌కు అభినందనలు,  ఆయన రాబోయే పదవీకాలానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.