ఒమన్లో రెండోరోజు ప్రధాని మోదీ పర్యటన
మస్కట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్, ఇథియోపియాలలో పర్యటించారు. ఒమన్కు రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం మస్కట్లో చేరుకొని, తర్వాత ఒమన్కు వెళ్లారు. మస్కట్ విమానాశ్రయంలో ఒమన్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధానమంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ మోదీకి ఘన స్వాగతం పలికారు. వివిధ రంగాలలో భారతదేశం-ఒమన్ సహకారాన్ని బలోపేతం చేయడం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చలు జరిపారు.
ఒమన్ సుల్తానేట్ అధినేత సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఈ మిత్ర దేశాన్ని సందర్శిస్తున్నారు. మోదీ గురువారం ఒమన్ సుల్తాన్తో చర్చలు జరపనున్నారు. భారతదేశం, ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఒమన్ సుల్తాన్, మోదీ సమక్షంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆయన ఒమన్ ప్రతిరూపం, వాణిజ్య, పరిశ్రమల, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి ఖైస్ అల్ యూసెఫ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తారు. సోషల్ మీడియా పోస్ట్లో మోదీ మాట్లాడుతూ, ఒమన్ భారతదేశంతో శాశ్వత స్నేహం, గాఢమైన చారిత్రక సంబంధాలు కలిగిన దేశమన్నారు. ఈ పర్యటన సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి కొత్త ఊపునివ్వడానికి ఒక అవకాశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.




