23-10-2025 04:28:47 PM
నరేంద్ర మోడీకి బీసీ జాక్ లేఖ..
హనుమకొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో లేఖని విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న బిల్లుపై, కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని, ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం, రిజర్వేషన్లు తగ్గిపోయిన పరిణామాలు లేఖలో వివరిస్తూ రాజకీయ ప్రాతినిధ్యంలో ఎంబీసీ లకి సంచార జాతులకి జరిగిన అన్యాయాన్ని కూడా లేఖ ద్వారా ప్రధానమంత్రికి తెలియజేశారు.
తమిళనాడు తరహాలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 69 శాతం రిజర్వేషన్లని చట్టబద్ధం చేసి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చిన విధంగానే తెలంగాణ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రధానిగా మీరు జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని డాక్టర్ శేషు తెలియజేసినారు. మహిళా బిల్లు సమస్యని, ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించిన విధంగానే ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల కోసం చూపిన చొరవ విధంగానే తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రధాని జోక్యం చేసుకొని బీసీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 42 శాతం రిజర్వేషన్లను సాధించటానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని రిజర్వేషన్ల కోసం పార్లమెంటును వేదికగా చేసుకొని పోరాడి రిజర్వేషన్లను సాధించాలని అభిప్రాయపడ్డారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తరువాత రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదనే నిబంధనకి అర్థం లేదు కాబట్టి 50 శాతం పరిమితిని ఎత్తివేసి బిసి రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. లేఖలో రిజర్వేషన్ల విషయంలో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన పూర్తి వివరాలు లేఖ ద్వారా అందజేశాం కాబట్టి రిజర్వేషన్ల విషయంలో ప్రధాని జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ధారబోయిన సతీష్, ఎదునూరి రాజమౌళి, ఎంబీసీ నాయకులు డాక్టర్ పాలడుగుల సురేందర్, కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గడ్డం కృష్ణయ్య, డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్, బుట్టి శ్యామ్ యాదవ్, సోమిడి అంజన్ రావు, చిన్నాల యశ్వంత్ యాదవ్, దామెరకొండ కొమరయ్య, వేణు చారి, డేనియల్ తదితరులు పాల్గొన్నారు.