కాలాన్ని దాటిన కవితలు
‘ఒక కుటుంబం. మూడు తరాల ఆలోచనలు.. ఒకే చోట ఒదిగితే ఎలా ఉంటుంది?’ ఈ ప్రశ్నకు సమాధానమే ‘కాలాన్ని దాటి వచ్చిన కవితలు’ (పోయెమ్స్ ఎక్రాస్ ది టైమ్) పుస్తకం. డాక్టర్ డీపీ ఆచార్య, బిభు ఆచార్య, అన్షుమాన్ ఆచార్య కలిసి ఈ గ్రంథాన్ని వెలువరించారు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కవులు ఈ సంకలనంలో తమ కవిత్వాన్ని అందించారు. వ్యక్తిగత జ్ఞాపకాలను ప్రపంచ మానవతా చైతన్యంగా మార్చిన అద్భుతమైన బహుళ తరం కవితా సంకలనం ఇది.
ఈ పుస్తకం చదవడం ఒక విలక్షణమైన అనుభూతిని ఇస్తుంది. మనసుకు అత్యంత చేరువైన వ్యక్తి హృదయంలో దాగి ఉన్న ఒక కఠిన సత్యాన్ని మృదువుగా చెవిలో చెప్పినట్లు అనిపిస్తుంది. చారిత్రక వేదనలు, ఆధునిక ఒంటరితనం తాలుకు వేదనలు ఈ కవితల్లో స్పష్టంగా కనిపిస్తాయి. తమదైన ప్రత్యేక దక్పథంతో ఆయా తరాల కవులు ఈ జీవిత సత్యాలను ఆవిష్కరించారు. చారిత్రక సంక్షోభాల నుంచి ఆధునిక మానసిక ఆందోళనల వరకు సాగిన ప్రయాణాన్ని ఈ కవితలు అద్దం పడతాయి. సాధారణంగా కవిత్వం అనగానే గంభీరమైన భాష గుర్తుకు వస్తుంది.
కానీ, ఈ కవులు ఆ శైలిని పక్కన పెట్టి, స్వచ్ఛమైన స్వేచ్ఛా వచనం ఉపయోగించారు. సంభాషణాత్మక లయల ద్వారా భావోద్వేగ ప్రభావాన్ని మరింత బలంగా వ్యక్తం చేశారు. సంక్లిష్టమైన, సరళమైన భాషలో చెప్పదలుచుకున్న విషయాలను సామాన్య పాఠకుడికి అర్థమయ్యేలా చెప్పారు. సంకలన విజయానికి ప్రధాన కారణం నిర్మొహమాటమైన నిజాయితీ. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత కరెంట్ అఫైర్స్, మానవ సంబంధాలు, రాజకీయ స్థానచలనం, అంతర్గత అస్తిత్వ భయాలు.. ఇలాంటి ఎన్నో అంశాలను ఈ ముగ్గురు కవులు అక్కడక్కడా పరికించారు.
వాటిపై తమదైన శైలిలో ప్రతిస్పందించారు. మొత్తానికి ఈ కవిత్వం కాలాన్ని కలుపుతుంది. సామూహిక అనుభూతికి, సహానుభూతికి వంతెనగా నిలుస్తుంది. లోతైన ఆత్మపరిశీలన కలిగిన ఆధునిక సాహిత్యాన్ని కోరుకునే వారికి ఈ పుస్తకం మంచి ఎంపిక. నిజాయితీతో కూడిన, సామాజిక-రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబించేలా కవితలు ఉన్నాయి. ప్రతి పాఠకుడిని అలరిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన ఉత్తమ కవితల సంకలనమిది.
డాక్టర్ రమేష్ శ్రీరంగం
(పేజీలు: ౧౬౦, వెల రూ.౨౯౯, ప్రతులు ‘అమెజాన్’లో లభ్యం)






