31 July, 2026 | 1:25 AM

కబ్జాలో మంత్రాల చెరువు

25-08-2024 01:14 AM
  1. అక్రమార్కుల చేతుల్లో 60శాతం స్థలం.. 
  2. అక్రమంగా వెలసిన బస్తీలు, కాలనీలు

మహేశ్వరం, ఆగస్టు 24: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రా ల చెరువు కబ్జాకు గురవుతున్నది. సర్వే నంబర్148లో దాదాపుగా 68 ఎకరాల విస్తరణలో మంత్రాల చెరువు ఉం డేది. రియల్ వ్యాపారులు చెరువుపై కన్నేసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను ఆక్రమించి లే అవుట్లు చేసి ప్లాట్లుగా విక్రయించారు. దాదాపు 60 శాతం వరకు చెరువు కబ్జా కు గురైంది. దీంతో చెరువు స్థలా లు బస్తీలుగా, కాలనీలుగా మారాయి. ఆలస్యంగా స్పందించిన అధికారులు కొన్ని రోజుల క్రితం మిగిలిన చెరువు చూట్టు ఫెన్సింగ్ వేశారు. చెరువు అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు. 

హైడ్రా స్పందిస్తేనే..

హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో హైడ్రా స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతుండటంతో చెరువులను అక్రమించి కట్టడాలు నిర్మించిన అక్రమదారుల గుండెల్లో గుబులు పుడు తున్నది. మంత్రాల చెరువు కబ్జాపై కూడా హైడ్రా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు కూల్చి చెరువును కాపాడాలని కోరుతున్నారు. 

చిన్నచెరువును రక్షించండి

అబ్దుల్లాపూర్‌మెట్: మజీద్‌పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని చిన్నచెరువు ఎఫ్‌టీఎల్‌ను కబ్జాచేసి వెంచర్ చేస్తున్నారని మజీద్‌పూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ నాయకులు ఆరోపించారు. 33.11 ఎకరాల చెరువు శిఖం భూములుండగా.. ఓ వ్యక్తి తమ పట్టా పొలమంటూ ఎఫ్‌టీఎల్‌లో రాళ్లు, మట్టితో పూడ్చి వేస్తున్నారని తెలిపారు. చిన్నచెరువులో తాము చేపలు పెంచుతూ బతుకుతున్నామని తెలిపారు. ఎఫ్‌టీఎల్ భూముల్లో తాటి వనాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. చెరువు ఆయకట్టు కింద దాదాపు 30 ఎకరాలు వ్యవసా య భూములున్నాయని చెప్పారు. చిన్నచెరువు శిఖం భూములను కేటీ రాజు అనే వ్యక్తి చదును చేస్తున్నట్లు సమాచారం రావడంతో మండల ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. పనులు నిలిపివేసి, రాజుపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు లకు ఫిర్యాదు చేశామని చెప్పారు.

రాజకీయ ప్రోద్బలంతో రియల్ వ్యాపారం 

రాజకీయ ప్రోద్బలంతోనే చెరువు స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. చెరువు చుట్టూ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారు. చెరువు లతో పాటు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు విన్నవించాం. 

 ఇంద్రావత్ రవినాయక్,

12వ వార్డు కార్పొరేటర్ 

కబ్జా చెర నుంచి చెరువును కాపాడుతాం

స్వార్థ ప్రయోజనాల కోసం మంత్రాల చెరువు స్థలాన్ని కబ్జా చేసి, లే అవుట్లు వేసి ప్లాట్లు విక్రయించారు. విషయం తెలియక అమాయకులు కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇండ్లు నిర్మించుకున్నారు. వీరంతా వర్షకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సాయంతో చెరువు కబ్జా కాకుండా కాపాడుతాం.

మాణిపాల్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, బాలాపూర్