02-06-2025 02:54:33 AM
ఎమ్మెల్సీ విజయశాంతి
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఎవరికి.. ఏ సమయంలో పదవికట్టబెట్టాలనేది కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసునని ఎమ్మెల్సీ విజయశాంతి చెప్పుకొచ్చారు. నిబద్ధత, నిజాయతీతో పనిచేసే వారికి సరైన సమయంలోనే పదవులు వస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆదివారం ఆమె మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
ఇటీవల పార్టీ అధిష్ఠానం నియమించిన అనేక కమిటీల్లో తన పేరు లేకపోవడం నిజమేనని, అయినప్పటికీ తనకు పార్టీ తనకు మరో కమిటీలో అవకాశం ఇస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, అంతకముందు మాత్రం ఆమె పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారని, బీసీ కోటాలో తనకు మంత్రి ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
కొనసాగుతున్న మీనాక్షి సమీక్షలు
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం ప్రణాళికలు రచిస్తున్నది. దీనిలో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులతో ఇతర సీనియర్ నాయకులతో భేటీ అవుతూ, వారికి సలహాలు, సూచనలిస్తున్నారు.
ఆదివారం ఆమె హైదరాబాద్లో నాగర్కర్నూల్, వరంగల్ పార్లమెంటరీ సెగ్మెంట్లకు చెందిన నాయకులతో మెదక్, అదిలాబాద్, కరీంనగర్లో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన కొందరు నాయకులు ఫిర్యాదు చేసిన అంశంపై మంత్రి కొండా సురేఖ ఆమెకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది.