23-06-2025 12:00:25 AM
మాదారం నుంచి వడక్ పల్లి వరకు అద్వానంగా మారిన రహదారి
పటాన్ చెరు, జూన్ 22 : పటాన్ చెరు నియోజకవర్గంలోని పలు ప్రధాన రహదారులు భారీ గుంతలు తేలడంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అమీన్ పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డి పేట ఓఆర్ఆర్ నుంచి వడక్ పల్లి మీదుగా జిన్నారం మండలంలోని మాదారం, కొడకంచి శివారు వరకు రోడ్డు భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు ఉదయం రాత్రి ప్రయాణీకులతో రద్దీగా ఉంటుంది.
మాదారం శివారులోని కంకర క్రషర్ ల నుంచి అధిక లోడ్ తో టిప్పర్ లు వెళ్తుండడంతో ఈ రోడ్డుపై తరుచూ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. పాల వ్యాపారస్తులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కార్లు, బైక్ లు తరుచూ చెడిపోతున్నాయి.
ప్రయాణం సాఫీగా జరిగేందుకు పలుమార్లు స్థానిక నాయకులు గుంతలను పూడ్చిన కొన్ని రోజులకే మళ్లీ అదే దుస్థితి ఏర్పడుతోంది. ఆర్అండ్బీ అధికారులకు సమస్యను విన్నవించిన రోడ్డు మరమత్తులు కూడా చేపడ్డం లేదని ఆ గ్రామాల ప్రజలు తెలిపారు. మరోవైపు ఇంద్రేశం నుంచి పెద్దకంజర్ల చౌరస్తా మీదుగా శివనగర్ గ్రామానికి వచ్చే రోడ్డు అద్వానంగా మారింది. రోడ్డు ఇబ్బందులను తీర్చాలని గ్రామస్తులుకోరుతున్నారు.