15-10-2025 07:56:51 PM
"అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి..
ఆచార్య పిల్లలమర్రి రాములు..
నకిరేకల్ (విజయక్రాంతి): పేదరికాన్ని విద్యతో జయించవచ్చునని, ఉన్నతమైనకల, జ్ఞానసముపార్జన, నిరంతరం శ్రమ, పట్టుదల అనే నాలుగు నియమాలను అనుసరిస్తే ప్రతివిద్యార్థి అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చునని కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ తెలుగు శాఖాధిపతి ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణపతకాల ప్రదానం & ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రత్న, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. నకిరేకల్ ప్రాంతం ప్రతిభావంతులకు, ప్రగతిశీల భావజాలానికి పుట్టినిల్లు అని, ఇక్కడ డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నకిరేకల్ జ్ఞానధారను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.
రాష్ట్ర రాజధానిలోని కళాశాలలతో పోటీపడుతూ ఇక్కడి అధ్యాపకులు బోధనా కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులు నకిరేకల్ డిగ్రీ కళాశాల సేవలను మరింత బాగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా.జి. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు కళాశాలలో దాతల సహకారంతో మూడు గోల్డ మెడల్స్ ఇవ్వడం అభినందనీయమని ఆయన అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు ఆచార్య రహత్ ఖానం మాట్లాడుతూ గ్రామీణ మహిళా విద్యార్థినులు వివక్షను ఎదిరించి ఉద్యోగం వచ్చేంతవరకు చదువును కొనసాగించాలని ఆయన కోరారు.
ఎన్.జి.కళాశాల ప్రధానాచార్యులు డా.ఎస్.ఉపేందర్ మాట్లాడుతూ నకిరేకల్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నామని ఆయన తెలిపారు. స్వర్ణపతక దాతలు నోముల గోవింద రాజులు,బెల్లి నాగరాజు యాదవ్, చౌగానియాదగిరి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకే కళాశాలలో స్వర్ణపతకాల స్థాపనకు ముందుకచ్చామన్నారు. కార్యక్రమానికి విద్యార్థినులు కీర్తన నందిని అనసంధానకర్తలుగా వ్యవహరించగా, కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాసాచారి, వైస్ ప్రిన్సిపాల్ నాగు,అధ్యాపకులు ప్రవీణ్ రెడ్డి,శ్రీనివాస్,హరిత,మధుసూదన్ రెడ్డి,శంకర్, రవీందర్,నర్సింహా చారి,శివశంకర్, ఉపేందర్, సుభాషిణి, కార్యాలయ సిబ్బంది వెంకన్న,సుదర్శన్,కార్తీక్, విద్యార్థినీవిద్యార్థులు,పుర ప్రముఖులు డా.సూర్యకుమార్, ఎస్ వి రావు, పరమేశ్ యాదవ్, బత్తిని వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన బి.ఏ, బి.కాం, బియస్సీ టాపర్స్ లోకేశ్, మాధవి,భవాని లకు గోల్డ్ మెడల్స్ అందించి ఒక్కొక్కరికి రూ.4,116/- నగదును అతిథుల చేతుల మీదుగా అందించారు.