15-10-2025 07:53:47 PM
5 రాష్ట్రాల మీదుగా ప్రయాణం
1,440 కి.మీ. దూరం
సిద్దిపేట క్రైం: సిద్దిపేట నుంచి శబరిమలై వరకు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర బుధవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని కోటిలింగేశ్వరాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. కళాకారులు విభిన్న వేషధారణలు ఆకట్టుకున్నాయి. మంగళ వాయిద్యాలతో, డప్పుల మోతలతో, అయ్యప్ప నామస్మరణతో పట్టణం మారుమోగింది. మహా పాదయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
దాతలు వివిధ రకాల ఆహార సామాగ్రిని భక్తితో సమర్పించి అయ్యప్ప స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. అఖిల భారత అయ్యప్ప శబరిమలై ట్రస్ట్, సిద్దిపేట కోటిలింగాల అయ్యప్ప సన్నిధానం ల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ మహా పాదయాత్రలో వివిధ ప్రాంతాల నుంచి 120 మంది అయ్యప్ప స్వాములు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడుల మీదుగా కేరళ రాష్ట్రంలోకి 1440 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది.
నవంబర్ 26 న మహా పాదయాత్ర ముగుస్తుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న వారు నేరుగా శబరిమలైలోని 18 మెట్లను అధిరోహించి స్వామిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా మహా పాదయాత్ర సారధులు గడప నాగరాజు, మధుసూదన్ రెడ్డి, యాదవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహా పాదయాత్ర వల్ల లక్షల కోట్ల జపం, అయ్యప్ప నామస్మరణం జరుగుతుందన్నారు. పాదయాత్రలో పాల్గొన్న అయ్యప్ప స్వాములకు ఆరోగ్యం ,ధైర్యము, విశ్వాసం లభిస్తాయని చెప్పారు.