ఉప్పల్లో ప్రఫుల్ షో
- రాజస్థాన్ జోరుకు బ్రేక్
- బ్యాటింగ్లో ఇషాన్ విధ్వంసం
- బౌలింగ్లో ప్రఫుల్ సంచలన స్పెల్
ప్రఫుల్ హింగే (4/34)
టార్గెట్ 217 పరుగులు ఉంచినా బ్యాటింగ్ పిచ్ కావడంతో విజయంపై నమ్మకం సగమే.. పైగా ఆడిన 4 మ్యాచ్ లలోనూ రాజస్థాన్ దుమ్మురేపిన వైనం.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికైతే హద్దే లేదు... ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువ పేసర్ దెబ్బకు రాజస్థాన్ బ్యాటింగ్ కకావికలమైంది. తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన ప్రఫుల్ హింగే మ్యాచ్ ను సన్ రైజర్స్ చేతిలో పెట్టేశాడు. తర్వాత జడేజా, ఫెరీరా పోరాడడంతో రాజస్థాన్ అవమానకరమైన ఓటమిని తప్పించుకుంది. దీంతో సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ రెండో విజయాన్ని అందుకుంటే.. రాజస్థాన్ రాయల్స్ కు తొలి ఓటమి ఎదురైంది.
హైదరాబాద్, ఏప్రిల్ 13 : టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. యువ పేసర్లు ప్రఫుల్ హింగే , సకీబ్ హొస్సేన్ లకు అవకాశమిచ్చింది. తొలి బంతికే అభిషేక్ శర్మ డకౌటవడంతో సన్రైజర్స్కు షాక్ తగిలింది. ఈ దశలో ఇషాన్ కిషన్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్తో కలిసి రెండో వికెట్కు 55 పరుగులు జోడించాడు.
హెడ్ (18) ఔటైన తర్వాత క్లాసెన్ తో కలిసి మరింత దూకుడుగా ఆడిన ఇషాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు క్లాసెన్ కూడా రెచ్చిపోవడంతో సన్ రైజర్స్ స్కోరు టాప్ గేర్ లో సాగింది. 39 బంతుల్లోనే 88 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ చేస్తాడనుకున్న ఇషాన్ కిషన్ 91 (8 ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులకు ఔటై 9 పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు.
అటు క్లాసెన్ 26 బంతుల్లో 40 (3 సిక్సర్లు, 1 ఫోర్) పరుగులకు ఔటవగా.. తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి(28) , అరోరా 24 పరుగులతో దూకుడుగా ఆడారు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగులు చేసింది. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు తీయగా.. దేశ్ పాండే, రియాన్ పరాగ్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. 217 పరుగుల భారీ టార్గెట్ను ప్రత్యర్థి ముందుం చినా కూడా ఉప్పల్ స్టేడియం బ్యాటిం గ్ పిచ్ కావడంతో సన్రైజర్స్కు గెలుపు సగం ఆశలే నిలిచాయి. ఎందుకంటే రాజస్థాన్ భీకర్ లైనప్ దీనికి కారణం. పైగా వైభవ్ సూర్యవంశీని ఆప డం ఎవరి వల్లా కావడం లేదు.
అయితే అందరికీ షాకిస్తూ విదర్భ పేసర్ ప్రఫుల్ సింగే అరంగేట్రంలోనే సంచలన బౌలింగ్తో చెలరేగిపోయాడు. తొలి ఓవర్లోనే 3 కీలక వికెట్లతో రాజ స్థాన్ బ్యాటింగ్ ను కుప్పకూల్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఓవర్లో ముగ్గురిని ఔట్ చేసి ప్రఫుల్ హింగే రికార్డు సృష్టించాడు. మొదట వైభవ్ వీక్ నెస్ బౌన్సర్ ను సంధించి ఔట్ చేశాడు. ఇదే ఓవర్లో జురెల్, ప్రిటోరియస్ లన పెవిలియన్ కు పంపాడు.
జైస్వాల్ ను మరో పేసర్ హొస్సేన్ ఔట్ చేస్తే... ప్రఫుల్ ముగ్గురు బ్యాటర్లను డకౌట్ చేశాడు. దీంతో రాజస్థాన్ కేవలం 9 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో ఫెరీరా, రవీంద్ర జడేజా రాయల్స్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ ఆరో వికెట్ కు 118 పరుగులు జోడించారు. తద్వారా రాజస్థాన్ ను ఘోరపరాభవం నుంచి గట్టెక్కించారు.
ఫెరీరా 44 బంతుల్లో 69 (7 ఫోర్లు, 3 సిక్సర్లు), జడేజా 32 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. చివరికి రాజస్థాన్ 159 పరుగులకు ఆలౌటైంది. సన్ రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 4, హొస్సేన్ 4 , మలింగ 2 వికెట్లు పడగొట్టారు.
స్కోరు బోర్డు
సన్రైజర్స్ హైదరాబాద్: 216/6 ( ఇషాన్ కిషన్ 91, క్లాసెన్ 40, నితీష్ రెడ్డి 28 ; ఆర్చర్ 2/37 )
రాజస్థాన్ రాయల్స్: 159 ఆలౌట్ ( ఫెరీరా 69, జడేజా 45, దేశ్పాండే 25 ; ప్రఫుల్ హంగే 4/34, బొస్సేన్ 4/24 )




