7 March, 2026 | 2:14 PM

ప్రతి ఒక్కరు పరిశుభ్రత కోసం నడుం బిగించాలి

07-03-2026 12:42 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని, కాబట్టి "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ"లో భాగంగా ప్రతి ఒక్కరు పరిశుభ్రత కోసం నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని ఎకో పార్క్‌ సమీపంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని స్వయంగా శ్రమదానం చేసి పార్క్ పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు.  కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ తట్టలు పట్టుకొని చెత్తను పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇల్లు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రత ద్వారా అనేక రకాల సీజనల్ వ్యాధులను నివారించవచ్చని అన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని స్వచ్ఛమైన పరిసరాల నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ సీతారాం, సిపిఓ హరికృష్ణ, డివైఎస్ఓ సుధీర్ రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.