24 April, 2026 | 7:42 PM

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి

24-04-2026 06:14 PM

ఊపిరితిత్తులోకి అన్నం వెళ్లి ఊపిరాడక అర్చన మృతి

ఆస్పత్రి సూపర్డెంట్ విజయభాస్కర్ వెల్లడి

బాన్సువాడ,(విజయక్రాంతి): కాన్పు కోసం వచ్చి ముద్దులాంటి చిన్నారికి కాన్పు ఇచ్చి తల్లి మృతి చెందిన ఘటన, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే పిట్లం మండలం బండపల్లి చెందిన అర్చన శుక్రవారం ఉదయం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కాన్పు కోసం తీసుకువచ్చారు. ఆస్పత్రిలో అర్చన ఆడ శిశువుకు జన్మనిచ్చింది, వెంటనే అర్చన అపస్మార స్థితిలోకి వెళ్లిపోయింది.

వైద్యులు అర్చనకు చికిత్స అందించడానికి ప్రయత్నించగా అప్పటికే అర్చన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆడ శిశు మాత్రం క్షేమంగా ఉంది. అర్చన ఆడ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత బాలింతను వార్డులోకి తీసుకువెళ్లారు. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అర్చన మృతి చెందింది. ఈ విషయంపై ఆసుపత్రి సూపర్డెంట్ విజయభాస్కర్ ను వివరణ కోరగా డెలివరీ అయిన తర్వాత అర్చన ను వార్డులో పడుకోబెట్టి అన్నం పెట్టడం వల్ల, అన్నం ఊపిరితిత్తులకు వెళ్లి శ్వాస ఆడక అర్చన చనిపోయినట్లు ఆయన తెలిపారు.