ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
ఆకేరు వాగు వద్ద ట్రెంచ్
మహబూబాబాద్ మార్చి 22 (విజయక్రాంతి): ‘ఆగని ఇసుక మాఫియా!’ మహబూబాబాద్ జిల్లాలో విస్తరిస్తున్న అక్రమ రవాణా, వాగుల్లో ట్రాక్టర్ల సందడి శీర్షికతో ఈ నెల 10న ప్రచురించిన వార్త కథనానికి పోలీస్ అధికారులు స్పందించారు. జిల్లా పరిధిలోని వాగులు, ఏర్లలో ఉన్న ఇసుకను తోడేయడంతో రాళ్లు తేలి సహజత్వాన్ని కోల్పోవడంతో పాటు వాగుల వెంట ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయే పరిస్థితి, ఇసుక మాఫియా జోరు, నెంబర్లు లేని ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా, అడ్డదారులు, ఇసుక మాఫియా కు హాట్ స్పాట్ల వివరాలతో సమగ్ర వార్తా కథనం ప్రచురించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాలతో పోలీసులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి కేంద్రీకరించారు.
ఈ మేరకు గత రెండు రోజులుగా జిల్లాలోని ఆకేరు పరివాహక మండలం నెల్లికుదురులో ఎస్ ఐ చిర్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ఆకేరు వాగు నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుం డా ఇసుక తోడేందుకు వెళుతున్న 8 ట్రాక్టర్లను సీజ్ చేసి, ఐదుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేశారు. ఇందులో నెంబర్లు లేని ట్రాక్టర్లను గుర్తించి వాటి యజమానులపై మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్టీవో అధికారులకు సిఫారసు చేశారు.
ఆకేరు వాగు నుండి ఇసుక అక్రమంగా తరలించకుండా పోలీసులు హాట్ స్పాట్లను గుర్తించి అక్కడ ట్రెంచ్ ( కందకం) తీయించారు. ఇసుక అక్రమ రవాణాకు వినియోగించే వాగు వెంట గుర్తించిన అడ్డదారుల్లో బ్రాహ్మణ కొత్తపల్లి వద్ద ట్రాక్టర్లు నడపకుండా ప్రత్యేకంగా జేసీబీ తో రోడ్డుకు అడ్డుగా కందకాలు తీయించారు. పోలీసులు ఎప్పటికప్పుడు ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
రెవెన్యూ, మైనింగ్ అధికారులూ స్పందించాలి
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా విషయంలో రెవెన్యూ, మైనింగ్ అధికారులు కూ డా స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. కేవలం పోలీసులు మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని, ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడాలంటే రెవెన్యూ, మైనింగ్ అధికారులతో పాటు రవాణా శాఖ అధికారులు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి చౌకగా ఇసుక లభించడంతోపాటు, ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నారు.




