వేసవిలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు
కొల్లాపూర్ టౌన్, మార్చి 4: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి ముందస్తు చర్యలు చేపట్టారు. బుధవారం మిషన్ భగీరథ ప్రధాన మంచినీటి పైప్లైన్ మరమ్మత్తు పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ యార్డు సమీపం సింగోటం నుండి కొల్లాపూర్ మున్సిపాలిటీకి వచ్చే మిషన్ భగీరథ మెయిన్ పైప్లైన్లో ఉన్న లీకేజీ పనులను పరిశీలించి, తక్షణమే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రహీం భాషా, కౌన్సిలర్లు ఎండి అన్వర్, పెబ్బేటి శేఖర్, పసుల సుజాత, మున్సిపాలిటీ అధికారులు మరియు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.




