15 May, 2026 | 3:30 AM

సాగు ఖర్చు తగ్గించుకుంటేనే లాభాలు

15-05-2026 02:18 AM

వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విజయలక్ష్మి

- జూపల్లిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

చారకొండ, మే 14: పెట్టుబడులు తగ్గించుకుని, లాభదాయక వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో గురువారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ డా పి. విజయలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ డాe యమ్. పల్లవి రైతులకు సాగు మెళకువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. రైతులు అవసరానికి మించి యూరియా, రసాయన ఎరువులను వాడటం వల్ల సాగు ఖర్చు పెరగడంతో పాటు నేల తల్లి ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూసారాన్ని కాపాడుకునేందుకు పంట మార్పిడి పద్ధతులను పాటించాలని, సాగు నీటిని పొదుపుగా వాడుకుంటూ సుస్థిర ఆదాయం పొందాలని కోరారు.

అనంతరం అసోసియేట్ ప్రొఫెసర్ డాe పల్లవి మాట్లాడుతూ.. మార్కెట్లో అందుబాటులో ఉన్న మేలైన, నాణ్యమైన విత్తన రకాలనే రైతులు ఎంపిక చేసుకోవాలన్నారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటల్లోని వివిధ రకాలు, వాటి కాలపరిమితి, దిగుబడి వివరాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి అనూష, మార్కెటింగ్ డైరెక్టర్ ముజ్జు, మండల వ్యవసాయ అధికారి తనూజా, ఏఈఓ జ్యోతి, మహేశ్వరీ, వంశీ, నాయకులు వెంకటయ్య యాదవ్, బాలరాజు, పరంజ్యోతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.