calender_icon.png 1 July, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములను పరిరక్షించండి

30-06-2025 11:02:18 PM

సామాజిక కార్యకర్త రాజశేఖర శర్మ..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువుల శిఖంల భూములపై జరుగుతున్న ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుడు రాజశేఖర శర్మ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జిల్లా కొత్తగా ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వ భూములపై విస్తృతంగా ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెరువులు, కుంటలు వంటి ప్రకృతి వనరులను ధ్వంసం చేసి అక్రమ నిర్మాణాలు వేయడం పట్ల సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

చట్టపరంగా చెరువు బఫర్ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నా కూడా, వాటిని ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఆక్రమణలపై గతంలో నివేదికలు ఇవ్వాలని ఆదేశించినా చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వ భూములు మరింత కబ్జాకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలపై వెంటనే పీ.డి యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగించి కూల్చివేయాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉందని రాజశేఖర శర్మ ఫిర్యాదులో స్పష్టం చేశారు. చివరిగా, భవిష్యత్ తరాలకు విలువైన ప్రకృతి వనరులు అందుబాటులో ఉండాలంటే ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.