23-11-2025 12:08:28 AM
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్రావు పదేపదే ప్రస్తావిస్తున్న ‘రూ. 5 లక్షల కోట్ల స్కాం ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవం. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టి మాట్లాడాలి’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సవాలు విసిరారు. లేదంటే.. ‘మీ ప్రచారం కేవలం పచ్చి అబద్ధం, రాజకీయ దురుద్దేశం అని ఒప్పుకుని రాష్ర్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
ఆరోపణలు, అబద్ధాలు ప్రచారం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. తిమ్మిని బమ్మిని చేయడంలో వారిని మించిన వారు మరొకరు లేరని మరోసారి నిరూపించుకున్నారని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎద్దేశా చేశారు. ‘మీరు అధికారం కోల్పోయారనే బాధతో రూ.5 లక్షల కోట్ల స్కాం అంటూ పాత రికార్డును పదే పదే వాయించే బదులు... మీరు ఆగస్టు 2023లో తెచ్చిన ఫ్రీహోల్డ్ జీవోల (19, 20, 21) వెనుక ఉన్న ‘రూ. లక్షల కోట్ల మతలబు’ గురించి ముందు రాష్ర్ట ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు.
గతంలో మంత్రిగా సుదీర్ఘ అనుభవమున్న హరీశ్ రావు తమ ప్రభుత్వంపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. పారదర్శకంగా రాష్ర్ట ఖజానాకు రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే... స్కాంలు చేసి చేసి అలవాటైన బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఇది మింగుడు పడటం లేదని ఆగ్రహించారు.
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రభుత్వ లీజ్ ల్యాండ్స్కు ఫ్రీహోల్డ్ రైట్స్ ఇచ్చి, 100 శాతం, 200 శాతం ఛార్జీలు విధించి ‘మీరు వసూలు చేద్దామనుకున్న రూ. లక్షల కోట్ల సంగతేంటి’ అంటూ ప్రశ్నించారు. అసలు ప్రభుత్వంతో సంబంధం లేని సీఎం రేవంత్రెడ్డి సోదరులపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారనే భ్రమ నుంచి బయటకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
రాష్ట్రా నికి పెట్టుబడులు రాకుండా యువతకు ఉద్యోగాలు దక్కకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని నిలదీశా రు. వాస్తవాలను దాచిపెట్టి తమ ప్రభుత్వం 9,292 ఎకరాలు అమ్మకానికి పెట్టిందంటూ తమపై దుష్ర్పచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.