30-06-2025 04:37:48 PM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..
ములుగు (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S.) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు, సిహెచ్. మహేందర్ జి, సంపత్ రావులు పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని, ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 85 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 39, గృహ నిర్మాణ శాఖకు 16, ఉపాధి కల్పనకు 03, పెన్షన్ 06, ఇతర శాఖలకు సంబంధించినవి 21 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, పరిష్కరించుటకు వీలుకాని సమస్యలను ఎందుకు పరిష్కరించబడవో దరఖాస్తుదారునికి వివరించే ప్రయత్నం చేయాలని, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరించిన వివరాలు దరఖాస్తుదారుడి మొబైల్ కి సమాచారం అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.