ప్రమాదం అంచున ప్రభుత్వ విద్య
- 1,864 స్కూళ్ల మూసేవేతకు కుట్ర
- రేవంత్ పాలనలో విద్యారంగం అస్తవ్యస్థం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రమాదం అంచున ప్రభుత్వ విద్య ఇందని, ఇది తెలంగాణకు మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేదలకు చదువును దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ఈ ఏడాది దాదాపుగా 1,864 స్కూళ్లను మూసి వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందన్నారు. స్కూళ్లను మూసి వేయాలనే ఆలోచన సిగ్గుచేటన్నారు. 2024లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య దాదాపు 2.4 లక్షలు తగ్గిందన్నారు. ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు.
టీచర్ పోస్టులను భర్తీ చేయాలె..
రాష్ర్టంలో ఖాళీగా ఉన్న దాదాపు 25 వేల టీచర్ల పోస్టును వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తోందని మండిపడ్డారు. కొన్ని రోజులుగా గురుకుల స్కూళ్లలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
పేదలు చదువుకోవడం ఇష్ట లేదా..
పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవటం రేవంత్ సర్కార్ కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి ఇప్పటివరకు లేడని, సీంఎకు విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని మండిపడ్డారు. సీఎంకు రాజకీయాలు, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప సమస్యలపై సోయి లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటానికి కారణాలు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కూడిన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై దృష్టి సారించకపోతే బీఆర్ఎస్ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.
అవని దేశానికి స్ఫూర్తి..
పారిస్ పారాలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో స్వర్ణం గెలిచి కాంస్యం సాధించిన అవని లేఖరాకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. మన పారా అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభతో భారతీయ క్రీడ రంగం సత్తా చాటుతున్నారన్నారు. ఇది మనందరికీ గర్వకారణమని, ఆమె విజయాలు దేశానికి స్ఫూరిగ్తా నిలిచాయని, అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న ఆమె సంకల్పం ఎంతో గొప్పదన్నారు.






