08-05-2025 07:51:35 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అదేశించారు. గురువారం మండలంలోని ఇటిక్యాల, కొత్తూరు, నెల్కి వెంకటాపూర్, మోదెల, చందారం, దౌడెపల్లి, పాతకొమ్ముగూడెం, కొత్తకొమ్ముగూడెం, గంపలపల్లి, తిమ్మాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 అదనపు బోనస్ అందించడం జరుగుతుందని అన్నారు. వరి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, నీడ, ఓఆర్ఎస్ సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లను సమకూర్చాలని అదేశించారు.
రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించాలి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదు జారీ చేయాలని, రైతులు, ధాన్యం వివరాలను ట్యాబ్లలో నమోదు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు ఆటోమెటిక్ యంత్రంతో శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాల వద్దకు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకురావాలని, అకాల వర్షాల సమయంలో కేంద్రాలలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించుకోవాలని తెలిపారు. ఎ గ్రేడ్ సాధారణ రకాలను గుర్తించాలి. రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. ఈ క్రమంలో పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.