ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు, రోజువారీగా ఆసుపత్రుల్లో సగటున నమోదవుతున్న ఓపి లు, తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లోకి వైద్యం కోసం వచ్చే రోగులకు సేవా దృక్పథంతో వైద్యం అందించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు, వృద్ధులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆసుపత్రులలో అవసరమైన మందులు అవసరాన్ని బట్టి ఇండెంట్ పెట్టి సమకూర్చుకోవాలన్నారు. అన్ని రకాల రిజిస్టర్లను పకడ్బందీగా నమోదు చేయాలని తెలిపారు. ఆసుపత్రులకు వచ్చే జనాలకు వివిధ విభాగాల సమాచారం తెలిసేలా బోర్డులు ఖచ్చితంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల మెరుగుదల కొరకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.






