18-06-2025 12:24:14 AM
బేగంపేట టూరిజం ప్లాజాలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): టూరిజం ప్లాజా హోటల్స్లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బేగంపేట లోని టూరిజం ప్లాజా హోటల్లో మంగళవారం మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్ అంతా కలియతిరుగుతూ ఆహార పదార్థాలను, కిచెన్ను పరిశీలించారు.
అల్పాహారం చేస్తున్న పర్యాటకులు, అతిథులతో మంత్రి మాట్లాడారు. ఆహార నాణ్యత, రుచి, సర్వీస్ గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. హరిత హోటల్స్లో సౌకర్యాలు, ఆహార నాణ్యతపై నిరంతరం పరిశీలన కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉందని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతోపాటు పర్యాటకులు, అతిథుల కోసం మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతారణం ఉండేలా హరిత హోటల్స్ను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు.