26 March, 2026 | 3:07 AM

బంకుల వద్ద బారులు

26-03-2026 01:26 AM

శంకర్ పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, మార్చి 25( విజయక్రాంతి): సరఫరా లోపం మరియు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. 

కొరత కారణంగా పెట్రోల్ దొరకదనే భయంతో ప్రజలు ప్లాస్టిక్ క్యాన్లు, డబ్బాల్లో ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా బైక్లు, కార్లు, సరుకు రవాణా వాహనాలు క్యూ లైన్లలో వేచి చూస్తున్నాయి. 

కొన్నిచోట్ల ’నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

ఉన్న నిల్వలను అందరికీ అందించాలనే ఉద్దేశంతో బంకు నిర్వాహకులు పరిమితంగానే ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల అత్యవసర ప్రయాణాలు చేసే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో ఎదురుచూపులు భరించలేక వాహనదారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసు కుంటున్నాయి. సిఎన్జి (CNG) వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రజల్లో ఉన్న ఆందోళన తగ్గడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.