7 July, 2026 | 1:04 AM

రేబిస్ టీకాలు వేయించాలి

07-07-2026 12:14 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, జూలై 6 (విజయక్రాంతి) : జిల్లాలో జంతు ప్రేమికులు కుక్కలు, వాటి పిల్లలకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమానికి జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి (డీవీఏహెచ్‌ఓ) డాక్టర్ యాకూబ్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణలతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, రైతులు, పశుపోషకులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలన్నారు. అనారోగ్యంతో ఉన్న జంతువులను వేరుగా ఉంచడం, పాలు, మాంసాన్ని పరిశుభ్రంగా నిర్వహించడం, చనిపోయిన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో పారవేయడం, అనుమానాస్పద లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని సూచించారు.

రేబిస్ వ్యాధి 100 శాతం నివారించ దగినదని, కుక్కలు, పిల్లలకు క్రమం తప్పకుండా రేబిస్ టీకాలు వేయించడం ద్వారా కుటుంబాలు, సమాజాన్ని సురక్షితంగా ఉంచవచ్చన్నారు. ఆరోగ్యకరమైన జంతువులు, ఆరోగ్యకరమైన మనుషులు, ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంతో అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు. శిబిరంలో 32 పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ ను పశు వైద్యులు వేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ శాంతి రేఖ, లైవ్ స్టాక్ అసిస్టెంట్ సోనియా, సహాయకులు గోవర్ధన్, గోపాలమిత్ర వేణు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.