calender_icon.png 30 May, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు

29-05-2025 02:26:22 AM

- రైళ్ల రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

- ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ

మహబూబాబాద్, మే 28 (విజయ క్రాంతి): మానుకోట రైల్వేస్టేషన్లో నాన్ ఇంటర్ లాకింగ్ (ఎన్‌ఐ ), రైల్వే ట్రాక్ మూడో రైల్వే లైన్ మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

మూడో లైన్ మరమ్మతు పనుల కోసం కాజీపేట - విజయవాడ సెక్షన్ లో నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లకు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో బదులు కేసముద్రం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. అయితే రైల్వే ట్రాక్ పనులు ఇంకా పూర్తి కాలేదని సమాచారం.

ఫలితంగా సికింద్రాబాద్, కాజీపేట, మహబూబాబాద్ మార్గంలో నడిచే పలు రైళ్లను బుధవారం పంగిడిపల్లి నుంచి విజయవాడ మీదుగా దారి మళ్ళించారు. ఇంకొన్ని రైళ్లను రద్దు చేశారు. 11019 కోణార్క్, 18046 ఈస్ట్ కోస్ట్, 17205 కాకినాడ రైళ్లను పంగిడిపల్లి నుంచి విజయవాడ మీదుగా దారి మళ్ళించారు.

ఇక 17202 గోల్కొండ, 12714 శాతవాహన, 12706 ఇంటర్సిటీ రైళ్లను రద్దు చేయగా, 17659 కాకతీయ  రైలును సికింద్రాబాద్ నుండి కాజీపేట వరకు మాత్రమే నడుపుతున్నారు. ఫలితంగా వరంగల్ నుంచి మహబూబాబాద్, ఖమ్మం వరకు రైళ్ల ద్వారా ప్రయాణించే ప్రజలు ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీనితో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళల సంఖ్య ఇప్పటికే బస్సుల్లో అధికంగా మారడంతో, తాజాగా రైళ్ల రద్దుతో అటు మహిళలతోపాటు పురుషులు కూడా బస్సుల్లో ప్రయాణించడానికి తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. 

రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇతర డిపోల నుంచి బస్సులను రప్పించి మహబూబాబాద్ నుంచి బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు.