29-05-2025 02:27:35 AM
కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరె
భూపాలపల్లి (మహబూబాబాద్) మే 28 (విజయ క్రాంతి): సరస్వతీ పుష్కరాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, పుష్కరాల నిర్వహణ తమ అదృష్టంగా భావిస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ సరస్వతి పుష్కరాలకు 30 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రభుత్వ మార్గదర్శనం మేరకు జిల్లా అధికార యంత్రాంగం తో పుష్కరాలను విజయవంతం చేసినట్లు చెప్పారు.
పుష్కర ఘాట్ వద్ద సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు హారతి ఇవ్వడానికి ప్రత్యేకంగా వేదిక నిర్మించి కాశి పూజారులతో సరస్వతి నవరత్న మాల హారతి దిగ్విజయంగా నిర్వహించినట్లు చెప్పారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అధునాతనమైన వసతి ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ఘాట్ వరకు బస్టాండ్ నుంచి దేవాలయం వరకు ఉచిత బస్సు సేవలు అందించినట్లు చెప్పారు.
పుష్కరాలకు 3వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, సామాన్య భక్తులతో పాటు పుష్కరాలకు వచ్చిన ప్రముఖులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్న చెప్పారు. ప్రభుత్వ, పోలీస్ యంత్రాంగం సరస్వతి పుష్కరాల విజయవంతనికి కృషి చేశారని కొనియాడారు.
సరస్వతి పుష్కరాల అనుభవం గోదావరి పుష్కరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో కాటారం కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏ ఎస్ పి బోనాల కిషన్, కాటారం డిఎస్పి రాంరెడ్డి, డి పి ఆర్ ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.