ఎత్తండి బీజేపీ జెండా!
- తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
- అవినీతి, కుటుంబ పాలన పార్టీలకు ఓటమి తప్పదు
- బంగాల్లో ఆశీర్వదించినట్లే ఇక్కడా ఆశీర్వదించాలి: ప్రధాని మోదీ
- అబ్ కీ బార్ మోదీ సర్కార్!
దేశం మొత్తం మార్పును కోరుకుంటుంది
పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో మోదీ వెల్లడి
పెట్రోల్, డీజిల్, గ్యాస్పై యుద్ధ ప్రభావం పడకుండా చూశాం
స్వదేశీ వస్తువులను ప్రోత్సహించండి
ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేద్దాం
విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్లను తగ్గించుకోవాలని పిలుపు
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): బీజేపీని బంగాల్ ప్రజలు ఆశీర్వ దించినట్లే తెలంగాణలోనూ ఆశీర్వదించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. పశ్చిమ బంగాల్ను గెలిచామని, తర్వాత లక్ష్యం తెలంగాణనే అన్నారు. బంగాల్లో భారీ మెజార్టీతో బీజేపీ గెలిచింద ని, బంగాల్ విజయోత్సాహం తెలంగాణలోనూ కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రె స్, బీఆర్ఎస్ రెండూ కూడా కుటుంబ పార్టీలేనని, ఏ రాష్ట్రంలోనూ కుటుంబ పాలనను ప్రజలు కోరుకోవడంలేదన్నా రు.
కుటుంబ పార్టీలకు ఓటమి తప్పదని చెప్పారు. అలాంటి పార్టీలకు దోచుకోవడమే లక్ష్యమని మోదీ విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తోందని, రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడాలని ప్రజ లు కోరుకుంటున్నారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని మోదీ పిలుపుని చ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం బీజేపీ బహిరంగ సభలో మోదీ తన ప్రసంగాన్ని.. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ప్రారంభించారు.
‘మొదట్లో బీజేపీకి దేశవ్యాప్తంగా ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు. అందులో ఒకరు తెలంగాణ నుంచే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ రా్రష్ట్రంలో భారీ మెజార్టీతో గెలుస్తుంది. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రెండూ కుటుంబ పార్టీలే. ప్రజ లు తమకు భరోసానిచ్చే పాలనను కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించాలి. బీజేపీ జెండా ను ఎత్తేందుకు అవకాశంలేని చోట కూడా ప్రభుత్వం ఏర్పాటు చేశాం.
అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదం తెలంగాణలో వినిపిస్తున్నది’ అని తెలిపారు. దేశంలోని ప్రతి మూలన బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంటున్నదని చెప్పా రు. దేశం మొత్తం ఇప్పుడు మార్పును కోరుకుంటున్నదని ప్రధాని తెలిపారు. దేశాభివృ ద్ధిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నదని ప్రధాని చెప్పారు. కొద్దిసేపటి క్రితం తాను వేలకోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించి వచ్చానని, దానివల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. దేశంలో 14 ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు జరుగుతున్నాయని, అందులో ఒకటి జహీరా బాద్లో ఏర్పాటు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణలో ఉందన్నారు.
అవినీతి పాలన అంతమైంది..
బంగాల్ ప్రజలు ప్రతిజ్ఞ చేసి మరీ బీజేపీని గెలిపించుకున్నారని, వారు ఓడించింది రాజకీయ పార్టీని కాదని, అవినీతి పాలనకు చరమగీతం పాడారని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగ వ్యతిరేఖ శక్తులు అక్కడ ఓడాయన్నారు. మమత నియంతృత్వం నుంచి బెంగాల్ విముక్తమైందని చెప్పారు. గతంలో అసోంలో బీజేపీకి ఒక్క సీటు ఉండేదని, ఇప్పుడు అక్కడ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుందని, అలాగే పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.
దేశం మొత్తం బీజేపీని కోరుకుంటుందన్నారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారని, కానీ బంగాల్లో ఘనవిజయం సాధించిన తర్వాత జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదన్నారు.
కాంగ్రెస్వి విద్వేష రాజకీయాలు
కాంగ్రెస్ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోందని, ఆ పార్టీ ఎంఎంసీగా మారిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎంఎంసీ అంటే ముస్లిం లీగ్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే బతికిఉందని, కర్ణాటక, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించినందుకు బాధపడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు అబద్ధపు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మరిచిపోవడం మాత్రమే కాంగ్రెస్కు తెలుసని విమర్శించారు. ‘ఓట్లు దండుకో.. తర్వాత మర్చిపో’ అనేది కాంగ్రెస్ పాలసీగా ఉంటుందన్నారు.
ఎన్నికల సమయంలో నింగిన ఉన్న చుక్కలు తెచ్చిస్తామని హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత ఉత్తి చేయి చూపించడం ఆ పార్టీకి అవవాటేనన్నారు. కర్ణాటక, తెలంగాణలోను ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు తెలంగాణ కూడా నక్సలైట్ రహితంగా మారిందన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మావోయిస్టులకు అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేసిందని, అప్పట్లో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే వారిని ఎప్పుడో అణిచివేసేవారని తెలిపారు.
ఏడాదిపాటు బంగారం కొనొద్దు..
అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. ఏడాదిపాటు పూర్తిగా బంగారం కొనుగోళ్లను నిలిపివేద్దామన్నారు. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలన్నారు. బంగారం దిగుమతులు తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందన్నారు. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారెజ్లను తగ్గించుకోవాలని తెలిపారు. దేశ ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసే దిశగా విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడుకోవాలని, ఇందుకు ఏడాది పాటు విదేశీ పర్య టనలు తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.
వంట నూనెల్లో స్వయం సమృద్ధి సాధించాలని తెలిపారు. మనం ఇంట్లో విదేశీ వస్తువుల వాడకం బాగా పెరిగిపోయిందని, ఇకపై స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్నారు. విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్న రసాయన ఎరువుల వల్ల భూమికి నష్టం వాటిల్లుతుందన్నారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడాలన్నారు. వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగానికి బదులుగా సోలార్ పంపుసెట్లను ప్రోత్సహిస్తున్నామని ప్రధాని చెప్పారు.
రైతులు స్వదేశీ పరికరాలను ఎక్కువగా వాడాలని విజ్ఞప్తి చేశారు. కేవలం దీపావళి పండుగకు దీపాలు కొనడం మాత్రమే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం కాదని, రోజూవారి జీవితం లో విదేశీ వస్తువులను కొనుగోలు చేయడం తగ్గించుకోవాలన్నా రు. మేడిన్ ఇండియా వస్తువుల వాడకం పెంచాలని, విదేశీ బ్రాండ్కు మేడిన్ ఇండియా వస్తువులు తక్కువేం కాదని మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా ఇంధన సంక్షోభం తలెత్తిందని, అయినప్పటికినీ దేశంలో ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నామన్నారు.
పెట్రోల్, డిజీల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు మెట్రో సేవలు, రైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. చాలా దేశాల్లో యూరియా బస్తా రూ.3 వేలుంటే, మనదగ్గర రూ. 300లోపు మాత్రమే ఉందని ఆయన చెప్పారు. ధరల ప్రభావం ప్రజలపై పడకుండా చూశామన్నారు. దీర్ఘకాలికంగా మనం పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పెట్రోల్, డిజీల్ సమస్యలను అధిగమించుకోవచ్చన్నారు. సమీప భవిష్యత్లో మనకు పెట్రోల్, డీజిల్ అవసరం తగ్గుతుందన్నారు. అన్నింటికీ దిగుమతులపైనే ఆధారపడితే దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అని ప్రధాని ప్రశ్నించారు. ‘నిత్యావసరాల్లో స్వదేశీ వస్తువులే ఎక్కువగా ఉండాలి. అవే వినియోగిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలి. స్వదేశీ కేవలం భాజపా నినాదం కాదు.. ఇది దేశ విధానం” అని మోదీ అన్నారు.
కాంగ్రెస్ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోంది. ఆ పార్టీ ఎంఎంసీగా మారింది. ఎంఎంసీ అంటే ముస్లిం లీగ్ పార్టీ. కాంగ్రెస్ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే బతికి ఉంది. కర్ణాటక, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించినందుకు బాధపడుతున్నారు. ‘ఓట్లు దండుకో.. తర్వాత మర్చిపో’ అనేది కాంగ్రెస్ పాలసీగా ఉంటుంది.
ప్రధాని నరేంద్ర మోదీ






