02-09-2024 12:00:00 AM
శ్యాంప్రసాద్ :
నాలుగు దశాబ్దాలుగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలలో పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడుగా, ఉత్తమ సాహిత్యవేత్తగా రాణించి పదవీ విరమణ చేస్తున్న డా. శంకరమంచి శ్యాంప్రసాద్ బోధన, రచనా స్రవంతులు నిరంతరం ఇరుదరులుగా ఒరుసుకొని సాగాలని కోరుకుందాం
కవిగా, రచయితగా, ఉపాధ్యాయుడుగా, వక్తగా పేరొందిన శంకరమంచి శ్యాంప్రసాద్ పాలకుర్తి వాస్తవ్యుడు. పాఠశాల విద్యను పాలకుర్తిలో పూర్తి చేసుకొని, హైదరాబాద్లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో పి.డి.సి.నుంచి ఎం.ఏ దాకా ఏడేళ్ళపాటు చదువుకున్నారు. ఎం.ఏలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన ఆయన 1990లో మాసబ్ట్యాంక్లోని ప్రభుత్వ విద్యాతత్వ కళాశాల నుండి తెలుగు పండిత శిక్షణను పూర్తి చేశారు. పగలంతా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సాయంత్రం పూట కళాశాల విద్యార్థిగా చదువును సాగించారు. 1991లో నవోదయ విద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా చేరి ముప్పుమైడేళ్లు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు.
శ్యాంప్రసాద్ ఉపాధ్యాయుడిగా కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో పని చేయడమే కాకుండా బీహార్లోని దర్భంగా, సమస్తిపూర్ నవోదయ విద్యాలయాలోను పనిచేశారు. క్రమశిక్షణ, పరిశీలన ఆయన నిరంతర అధ్యయనం. అధ్యాపనంలో విద్యార్థుల మనసును, అటు అధికారుల మన్ననలను పొందారు. ఒకచోట ఎంతకాలం పనిచేశామన్నది కాక ఏ విధంగా ప్రభావితం చేశామన్నది కొలబద్దగా ఆయన తన విధులు నిర్వహించారు.
విద్యార్థుల సామాజిక నేపథ్యం, సైకాలజీని అర్థం చేసుకొని ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా తన బోధనా వ్యాసంగాన్ని కొనసాగించారు. విద్యార్థులలో మాతృభాషాభిమానం కొడిగడుతున్న దశలో శ్యాంప్రసాద్ తను పని చేసే విద్యాలయాలలో చుక్కా రామయ్య లాంటి మేధావులను, సుద్దాల అశోక్ తేజ వంటి కళాకారుల్ని రప్పించి, పిల్లలలో స్ఫూర్తిని నింపేలా కృషి చేశారు. సదస్సుల నిర్వహణలో శ్యాంప్రసాద్ది అందె వేసిన చేయి.
బోధన నుంచి రచనా రంగం వరకు!
ఒకవైపు ఆదర్శ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు బాధ్యత కల్గిన రచయితగా పలు రచనలు చేశారు. వివిధ పత్రికలో విద్య, సాహిత్య రచనలు చేశాడు. స్వస్థలమైన పాలకుర్తి, బమ్మెర గ్రామాలలో సదస్సులు నిర్వహించారు. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం పాలకుర్తిలో సోమనాథుని అష్ట శతజయంతి ఉత్సవాలు నిర్వహించింది. ఈ ఉత్సవాల స్ఫూర్తితో శ్యాంప్రసాద్ ‘సాహితీ వైతాళీకుడు పాల్కురికి సోమనాథుడు’ పేర ఒక గ్రంథం రాశారు. విద్యార్థులలో క్రమశిక్షణ దేశభక్తి, నైతిక విలువలు, సంస్కృతిపట్ల అవగాహన, ఆదరాన్ని పెంచడానికై ‘సత్యవాణి’ పేర్న శతకాన్ని రాశారు.
పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన జీవిత సాహిత్యాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ ‘సోమన పోతన’ పేర్న లఘు గ్రంథం వెలువరించారు. అలాగే, పాలకుర్తి మండలంలో పుట్టి వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైన ప్రముఖులు చుకా రామయ్య, సి. రాఘవాచారి, అంపశయ్య నవీన్, విశ్వనాథం, పన్నాల రామయ్య ప్రభృతులను గురించి ‘పాలకుర్తి ప్రముఖులు’ శీర్షికతో గ్రంథం రాశారు. పాల్కురికి సోమనాథుని గురించి, ఆయనపై వచ్చిన పరిశోధన గ్రంథాలను గురించి సమీక్షిస్తూ 2007లో ‘శ్రీ పాల్కురికి సోమన సాహితీ వైజయంతి’ పేర్న గ్రంథం రాశారు.
శతాధిక గ్రంథకర్త, బహుముఖ ప్రజ్ఞావి అయిన ‘మలయశ్రీ కవిత్వం -పరిశీలన’ అంశంపై పరిశోధన చేసి 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య జీవిత విశేషాలను, విద్య, సామాజిక రంగాలకు ఆయన చేసిన సేవను వివరిస్తూ 2011లో ‘ఉద్యమ జీవి చుక్కా రామయ్య’ గ్రంథం వెలువరించారు. శ్యాంప్రసాద్ సాహిత్యరంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన ప్రముఖుల్ని పేర్కొంటూ వారి సాహిత్యాన్ని విశ్లేషిస్తూ 2015లో ‘సాహిత్య ప్రభలు’ పేర్న గ్రంథం రాశారు. తనను ప్రభావితం చేసిన సంఘటనలకు కొంత కల్పననూ జోడించి చుట్టూ ఉన్న సమాజాన్ని వ్యక్తుల స్వభావాల్ని వివరిస్తూ 2017లో ‘స్ఫూర్తి’ పేరుతో పదకొండు కథలతో సంపుటిని వెలువరించారు.
ఆయన రాసిన పాల్కురికి ప్రభ, నవనీతం వ్యాస సంపుటలు, కవితలు అముద్రితంగానే ఉన్నాయి. పాలకుర్తి సోమేశ్వరునిపై 1930లో నవాబుపేటకు చెందిన ముదిగొండ విరూపాక్షయ్య రచించిన సోమశేఖర శతకాన్ని సేకరించి 2023లో వెలుగులోకి తెచ్చారు. ఇలా ఆయన ఎన్నో రచనలు చేశారు. సభలలో పాల్గొన్నారు. గంభీరమైన విషయ పరిజ్ఞానంతో సభలను మెప్పించడం ఆయనకే చెల్లింది. వ్యాసమైనా, ఉపన్యాసమైనా ఆయనదొక ప్రత్యేక ఒరవడి.
శ్యాంప్రసాద్ ప్ర తిభా విశేషాలను గుర్తించి రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు, సాహిత్య సంస్థలు సన్మానించాయి. నాలుగు దశాబ్దాలుగా ప్రైవేటు, ప్రభు త్వ విద్యాసంస్థలలో పనిచేసి ఇటు ఉత్తమ ఉపాధ్యాయుడుగా, అటు ఉత్తమ సాహిత్యవేత్తగా రాణించి పదవీ విరమణ చేస్తున్న డా. శంకరమంచి శ్యాంప్రసాద్ బోధన, రచనా స్రవంతులు నిరంతరం ఇరుదరులుగా ఒరుసుకొని సాగాలని కోరుకుందాం. జీవితంలో ఎదురైనా ఒడుదొడుకులను ఒడుపుగా ఎదుర్కొంటూ సాగిన ఆయన గమనం వర్తమాన యువతకు స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.
- డా. పల్లె వెంకన్న