28-05-2025 12:17:27 AM
19 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన రేవంత్ ప్రభుత్వం
హైదరబాద్, మే 27 (విజయక్రాంతి): గత 19 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. వరంగల్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ భీమ్ సింగ్ సర్వీస్ లో ఉండగా 1996 ఎన్ కౌంటర్లో మరణించారు. తండ్రి మరణం నేపథ్యంలో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు రాజశ్రీ దరఖాస్తు చేసుకున్నారు.
అయితే వివిధ సాంకేతిక కారణాలు చూపిస్తూ గత ప్రభుత్వాలు 19 ఏళ్లు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజశ్రీ సమస్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం రేవంత్ హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ సీఎంవోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజశ్రీ తన కుటుంబంతో కలిసి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు.