calender_icon.png 31 July, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు

30-07-2025 10:53:29 PM

దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్..

దేవరకొండ: రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా బుధవారం దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చింతపల్లిలో నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు ఎమ్మెల్యే బాలునాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బాలునాయక్(MLA Balu Naik Nenavath) మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవేర్చడం జరుగుతున్నదని, తక్కిన వాటిని కూడా నెరవేరుస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, అలాగే ఇండ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు 6 గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతున్నదని, అదేవిధంగా 9 రోజుల్లోనే 9000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేయడం జరిగిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం పంపిణీ వంటివి తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.

ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని, కార్డులు రానివారు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే విచారించి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో భాగంగా అన్ని వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలకు సన్న బియ్యం నిరంతరం  ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా మండల స్థాయి స్టాక్ పాయింట్లు ఎప్పటికప్పుడు అధికారులు తనకి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకించి తహసిల్దార్ మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు ఎమ్ ఎల్ ఎస్  పాయింట్లు తనిఖీ చేస్తున్నామని తెలిపారు.

దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12008 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, అంతేకాక 24554 మంది సభ్యులను రేషన్ కార్డులలో చేర్చడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. చౌక ధర దుకాణ డీలర్ల సమస్యలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, త్వరలోనే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద సాగునీటిని విడుదల చేసినందున, అన్ని డిస్ట్రిబ్యూటరీల ద్వారా సక్రమంగా సాగునీరు అందించేందుకు ఒక ఎకరా ఎండిపోకుండా సాగునీటిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లు, సీజనల్ వ్యాధులు, తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమణారెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డిఎం హరీష్ ,తహసిల్దార్ రామకాంత్ శర్మ, తదితరులు హాజరయ్యారు.