calender_icon.png 14 June, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి

11-06-2025 01:21:39 AM

  1. కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్ పటాన్ చెరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దడమే ధ్యేయం
  2. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..450 మంది పదో తరగతి ప్రతిభావంతులకు రూ.9లక్షల నగదు పురస్కారాల పంపిణీ 

పటాన్ చెరు, జూన్ 10 :  విద్యార్థి జీవితంలో లక్ష్యం అనేది అత్యంత కీలకమని, ఇష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు.  చదువు అనే ఆయుధం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు.

మంగళవారం పటాన్ చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నగదు పురస్కారాల పంపిణీ చేశారు. దీనికి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యేతో కలిసి విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ తాను విద్యార్థి దశలోనే కలెక్టర్ కావాలన్న లక్ష్యం ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని లక్ష్యాన్ని సాధించానని వివరించారు.  పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు.

అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సమాజంలోని అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. బీహార్ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబం నుండి వచ్చిన తాను ఐపీఎస్ సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థి దశ నుండే ప్రణాళికాబద్ధంగా చదువుతూ లక్ష్యాన్ని సాధించానని తెలిపారు. 

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అత్యధిక శాతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న లక్ష్యంతో గత దశాబ్ద కాలంగా ప్రతి ఏటా పదవ తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే మోటివేషనల్ తరగతులు నిర్వహించడంతోపాటు పరీక్షల సమయంలో పరీక్ష సామాగ్రిని అందిస్తూ వారికి తోడుగా నిలుస్తున్నామని తెలిపారు.

నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన 450 మంది విద్యార్థులకు మొదటి బహుమతి 3 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి రెండు వేల రూపాయలు, తృతీ య బహుమతి ఒక వెయ్యి రూపాయల చొప్పున తొమ్మిది లక్షల రూపాయల నగదు పురస్కారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.