02-01-2026 12:00:00 AM
గత డిసెంబర్లో రూ.1.74 లక్షల కోట్ల వసూళ్లు
2024 డిసెంబర్తో పోలిస్తే 6.1 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జనవరి 1 : దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని సూచిస్తూ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 డిసెంబర్ నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,74,550 కోట్ల ఆదాయం సమకూరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2024 డిసెంబరులో నమోదైన రూ.1,64,556 కోట్లతో పోలిస్తే ఇది 6.1 శాతం అధికం కావడం గమనార్హం. పండుగల సీజన్ తర్వాత కూడా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయనడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
డిసెంబర్ నెల వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.34,289 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ వాటా రూ.41,368 కో ట్లుగా ఉంది. ఇక ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా అత్యధికంగా రూ.98,894 కోట్లు వసూలయ్యాయి. రుణ బకాయిల చెల్లింపుల కోసం తాత్కాలికంగా కొనసాగిస్తున్న జీఎస్టీ పరిహార సెస్ రూపంలో ప్రభుత్వానికి మరో రూ.4,551 కోట్లు అందాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ సెస్ ద్వారా మొత్తం రూ.88,385 కోట్లు వసూలయ్యాయి.