18 April, 2026 | 2:27 PM

యాదాద్రికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

28-06-2024 01:35 AM

30 రోజుల్లో రూ. 3.49 కోట్ల నగదు కానుకలు

యాదాద్రి భువనగిరి, జూన్ 27( విజయక్రాంతి) : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల నుంచి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. 30 రోజుల హుండీ ఆదాయం రూ.3,49,47,177 కోట్ల నగదుతో పాటు 166 గ్రాముల బంగారం, 4 కిలోల 750 గ్రాముల వెండి కానుకలతో పాటు పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించారు. ఆలయ చరిత్రలో హుండీ కానుకల్లో రోజూవారి సగటు ఆదాయం ఇదే అధికమని అధికారులు ప్రకటించారు. అధికారులు గురువారం  30 హుండీ కానుకల లెక్కింపును జరిపారు. రోజువారి సగటు హుండీ ఆదాయం రూ.11.25 లక్షలు సమకూరిందని, ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఆదాయమని తెలిపారు.

వేసవి సెలవుల ముగింపుతో పాటు విద్యాసంస్థలు ప్రారంభమైన అనంతరం కూడా ఆలయ సందర్శనకు భక్తుల తాకిడి పెరిగింది. దానికి అనుగుణంగా వివిధ కైంకర్యాల ద్వారా నిత్యాదాయంతో పాటు హుండీ సగటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. కాగా, స్వామివారికి నిత్యకైంకర్యాల ద్వారా గురువారం రూ.20,97,264 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు తెలిపారు.