calender_icon.png 26 June, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట

26-06-2025 12:00:00 AM

  1. ఖాతాల్లో మెడికల్ బిల్లులు జమ
  2. రూ.2 లక్షల వరకు చెల్లింపులు 
  3. రూ.270 కోట్లు విడుదల చేసిన సర్కార్!
  4. అన్ని బిల్లులను క్లియర్ చేయాలని టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్ల డిమాండ్

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కాస్త ఊరట లభిస్తోంది. ప్రభుత్వం గత క్యాబినెట్‌లో ప్రకటించినట్టుగానే గత మూడు, నాలుగు సంవత్సరాల పెండింగ్ బిల్లలను క్లియర్ చేస్తూ వస్తోంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ మొదలైనట్టు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

ఈ బిల్లుల కోసం కొన్నేళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్లు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. తమ బిల్లులను ఎప్పుడు మంజూరు చేస్తారోనన్న ఆందోళన వారిలో ఉండేది. కానీ దాదాపు సోమవారం నుంచి మెడికల్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి రూ.270 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్టు సమాచారం.

గత క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోదం తెలిపిన విధంగా ఇక నుంచి ప్రతినెలా మెడికల్ బిల్లులతోపాటు పెండింగ్ బిల్లులు రూ.700 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఖాతాల్లో నేరుగా బిల్లులు జమవుతున్నాయి. 

మొత్తం బిల్లులు రూ.పది వేల కోట్లు

దాదాపు పదివేల మందికి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో జీపీఎఫ్, టీజీఎల్‌ఐసీ, జీఐఎస్, గ్రాట్యూటీ, లీవ్‌ఇన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్, మెడికల్ బిల్లులన్నీ కలిపి సుమారుగా రూ.10 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు.

వీరు అనారోగ్యం బారిన పడితే, ముందుగా వీరు జేబుల్లోంచి పెట్టుకొని ఆ తర్వాత ప్రభుత్వానికి రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఉదాహరణకు ఓ ఉపాధ్యాయుడు తన మెడికల్ బిల్లుల కోసం తొలుత జిల్లా డీఈవోకు బిల్లులు సబ్‌మిట్ చేయాలి. అక్కడి నుంచి ఆ ఫైల్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు చేరుతుంది. అటునుంచి మెడికల్ బోర్డు డీఎంఈకు వెళ్తుంది. ఆ బిల్లులను వైద్యుడి పరిశీలిస్తాడు.

వైద్యానికి ఎంత ఖర్చయ్యింది? ప్రభుత్వ లెక్కల ప్రకారం సదరు వ్యాధి చికిత్సకు ఎంత నిర్ధారణ చేశారు? ప్రైవేట్ హాస్పిటల్ ఎంత బిల్లు వేసింది? అని బేరీజు వేసి ఇస్తారు. మళ్లీ ఆ ఫైల్ పైస్థాయి నుంచి జిల్లా స్థాయికి రావాల్సి ఉంటుంది. దీనంతటికి ఓ ఏడాది సమయం పడుతోంది. ఆ తర్వాత బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాలంటే తక్కువలో తక్కువ మరో ఆరు నెల్లలపైనే సమయం పడుతోంది. ఇలా 2021 నుంచి రావాల్సిన బిల్లులు కూడా ఉన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 

మిగతా బిల్లులు ఎప్పుడు?

ప్రస్తుతానికి ప్రభుత్వం ఇతరత్రా చిన్న చిన్న బిల్లులతోపాటు మెడికల్ బిల్లులను క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మిగతా బిల్లులనూ క్లియర్ చేయాలని ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రభుత్వమిచ్చే బిల్లుల్లో రూ.2 లక్షల వరకు మాత్రమే మెడికల్ బిల్లులుంటున్నాయి. భారీగా ఉన్న జీపీఎఫ్, జీఎల్‌ఐసీ, జీఐఎస్, గ్రాట్యూటీ, కమ్యూటేషన్ బిల్లులు పెన్షనర్లకు రావడంలేదు.

జీపీఎఫ్ కింద ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు, గ్రాట్యూటీ కింద రూ.16 లక్షల వరకు, లీవ్‌ఇన్‌క్యాష్‌మెంట్ కింద రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలు, కమ్యూటేషన్ కింద రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షలు, టీజీఎల్‌ఐ కింద రూ.5 లక్షల వరకు బెనిఫిట్స్ రావాల్సి ఉన్నాయి. మెడికల్ బిల్లులతోపాటు మిగిలిన బిల్లులనూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

బిల్లు వస్తుందో రాదో అనుకున్నా: సంధ్యారాణి టీచర్, కరీంనగర్

బిల్లు వస్తుందో రాదో అనుకున్నా. సోమవారం ఖాతాలో రూ.లక్ష బిల్లు జమైంది. 2022లో మా నాన్న గారికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్ కోసం మెడికల్ బిల్లు పెట్టుకుంటే అది రిజక్ట్ కావడంతో మళ్లీ గతేడాది దరఖాస్తు చేసుకున్నా. అదిప్పుడు బ్యాంకు ఖాతాలో జమైంది. రూ.లక్షకుపైగా వైద్యానికి ఖర్చయింది. అందులో రూ.లక్ష జమ చేశారు.

మిగతా బిల్లులూ ఇవ్వాలి: జీ అశోక్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మెడికల్ బిల్లులు బ్యాంకుల్లో జమ అవుతున్నాయి. ఒకరికి రూ.1.45 లక్షలు, మరొకరికి రూ.1.30 లక్షలు బిల్లులు వారివారి ఖాతాల్లో పడ్డాయి. రెండు మూడు రోజుల నుంచి మెడికల్ బిల్లులను ప్రభుత్వం జమ చేస్తోంది.

ఇది మంచి విషయమే కానీ, మిగతా పెద్ద పెద్ద బిల్లులు గ్రాట్యూటీ, కమ్యూటేషన్ జీపీఎఫ్ లాంటి పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయాలి.  ఇచ్చిన మాటప్రకారం బిల్లులు విడుదల: కటకం రమేశ్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ బిల్లులు చెల్లిస్తోంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. అదేవిధంగా మిగిలిన అన్ని బిల్లులనూ క్లియర్ చేయాలి. ఈ విధానాన్ని కంటిన్యూ చేయాలి. 

తొందరగా బిల్లులు క్లియర్ చేయాలి: లక్ష్మయ్య, పెన్షనర్ జేఏసీ చైర్మన్

ప్రభుత్వం బిల్లుల జారీ ప్రక్రియను ప్రారంభించడం శుభపరిణా మం. కానీ అన్ని బిల్లులను క్లియర్ చేయాలి. పీఆర్సీ, ఏరియర్స్ అన్ని ఇచ్చేయాలి. రిటైర్డ్ అయిన వారు బి ల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక డీఏను ప్రకటించింది. జూలై నుంచి మరో డీఏ జమవుతోం ది. అన్ని బిల్లులను ప్రతినెలా క్లియర్ చేసుకుంటూ పోతే బాగుంటుంది.